శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (05:10 IST)

సలావుద్దీన్ ప్రపంచ ఉగ్రవాది: అమెరికా ప్రకటనతో భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ కాకముందే భారత దౌత్య చరిత్రలో అతి పెద్ద విజయం లభించింది. పాకిస్తాన్‌లో ఉంటున్న హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌ నేత సలావుద్దీన్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ మేరక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ కాకముందే భారత దౌత్య చరిత్రలో అతి పెద్ద విజయం లభించింది. పాకిస్తాన్‌లో ఉంటున్న హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌ నేత సలావుద్దీన్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కశ్మీర్‌లో అల్లకల్లోలానికి కారణం సలావుద్దీనేనని భారత్‌ చెప్తున్నవి కేవలం ఆరోపణలేననే పాకిస్తాన్‌ కపట వేషాలు బయటపడ్డాయి.  సలావుద్దీను గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించడం పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బే. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా వద్ద పాక్ పాచికలు పారడం లేదు.
 
పాకిస్థాన్‌లో ఉంటూ భారత్‌ను అల్లకల్లోలం చేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా  ప్రకటించింది. అమెరికాలో మోదీ పర్యటిస్తుండగానే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా రక్షణ మంత్రితో మోదీ సమావేశమైన కాసేపటికే అమెరికా ఈ నిర్ణయం ప్రకటించింది. అమెరికా ప్రకటనతో సలావుద్దీన్‌కు సహకరిస్తున్న వారిపై కూడా ఆంక్షలు కొనసాగుతాయి. 
 
సలావుద్దీన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటూ భారత్‌ను అస్థిరం చేసేందుకు యత్నిస్తున్నాడు. ముఖ్యంగా కశ్మీర్‌లో ఉగ్రవాదానికి అన్నివిధాలా సహకారం అందిస్తున్నాడు. కశ్మీర్‌లో అశాంతి నెలకొనడానికి, అల్లర్లకు సలావుద్దీన్ కారకుడని భారత్ చాలాకాలంగా చెబుతూ వస్తోంది. సలావుద్దీన్‌పై చర్యలను అమెరికా త్వరలోనే ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో పుట్టిన సలావుద్దీన్‌కు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా భారత్‌లోనే ఉంటూండటం గమనార్హం.
 
భారత్, అమెరికా దేశాలు రెండూ ఉగ్రవాద పీడిత దేశాలే కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయని, ఒక ప్రత్యేక రంగానికి పరమితం కాకుండా ఉగ్రవాదం సరిహద్దులు లేకుండా ప్రపంచమంతా వ్యాపించిందని, ఇప్పడది ప్రపంచ ఉపద్రవకారి అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యాత గోపాల్ బాగ్లే వ్యాఖ్యానించారు. సలావుద్దీన్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తపరిచారు.