శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (08:25 IST)

లోన కత్తులు నూరుతున్నా.. దాయాది దేశాల ప్రధానులు దౌత్య భాషలో ఇలా మాట్లాడాల్సిందే...

గత సంవత్సరం ప్రారంభంలో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడి తదనంతర పరిణామాల క్రమంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరుదేశాల ప్రధానులు కానీ, సీనియర్ దౌత్య అధికారులు కాని ఏవేనా

గత సంవత్సరం ప్రారంభంలో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడి తదనంతర పరిణామాల క్రమంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరుదేశాల ప్రధానులు కానీ, సీనియర్ దౌత్య అధికారులు కాని ఏవేనా అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో కలిస్తే  ముఖాలకేసి తేరిపార చూసు కోవడానికి కూడా ఇష్టపడనంతగా భారత్-పాక్ సబంధాలు ముడుచుకుపోయాయి. పాక్ నమ్మక ద్రోహానికి ఇక మాటలతో పనిలేదని భారత్ సైన్యం సర్జికల్ దాడులు జరపడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. 
 
ఇన్నాళ్ల తర్వాత ఇరుదేశాల రాజకీయ నాయకత్వం ముఖాముఖి కలవడమే కాకుండా ప్రధానులు మోదీ, షరీఫ్ కరచాలనం కూడా చేసుకున్న ఘటనకు చైనా సాక్షీభూతంగా నిలుస్తోంది. సరిహద్దులో నిత్యం పోట్లాడుకునే దాయాదులు.. కలిసికట్టుగా ఒకే ప్రతిజ్ఞ చేసిన సందర్భమిది. ప్రఖ్యాత షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లోకి పూర్తిస్థాయి సభ్యులుగా భారత్‌, పాకిస్తాన్‌లు ప్రమాణం చేశాయి. కజకిస్తాన్‌ రాజధాని అస్తానాలో ఎస్‌సీఓ వార్షిక సదస్సులో ఈ మేరకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పూర్తికాల సభ్యులుగా చేరిన సందర్భంగా భారత్‌, పాక్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్‌ షరీఫ్‌లను సంస్థలోని ఇతర సభ్యదేశాలు అభినందించాయి.
 
12ఏళ్ల పరిశీలన అనంతరం భారత్‌కు ఎస్‌సీఓ సభ్యత్వం దక్కడం ఆనందరంగా ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ.. సభ్యదేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కలిసికట్టుగా పోరాడుదామని అన్నారు. మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని, దానిని అంతం చేస్తేనేగానీ ప్రగతి సాధించలేమని పేర్కొన్నారు.
 
‘ఎస్‌సీఓలో సభ్యత్వం పొందిన శుభసందర్భంలో భారత్‌కు నా శుభాకాంక్షలు..’ అంటూ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌ తన ఉపన్యాసాన్ని ప్రారంభించడం గమనార్హం. ‘మన భవిష్యత్‌ తరాలను యుద్ధం, సంఘర్షణలవైపు పోనియ్యకుండా శాంతిసమాధానాలతో జీవించేలా చేయడం మన కర్తవ్యం. ఇందుకు షాంఘై సహకార సంస్థ కృషిచేస్తుంది’అని షరీఫ్‌ అన్నారు.
 
యూరప్‌-ఆసియా దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారం కోసం షాంఘై(1996లో)లో ఏర్పాటయిన కూటమిని షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో చైనా, కజకిస్తాన్‌, కర్గీజ్‌స్తాన్‌, తజకిస్తాన్‌, రష్యాలు వ్యవస్థాపక సభ్యుదేశాలుగా ఉన్నాయి. మొదటి విస్తరణ(2001)లో ఉబ్జెకిస్తాన్‌ సభ్యత్వం పొందగా.. నేడు(9 జూన్‌, 2017) భారత్‌, పాకిస్థాన్‌లు పూర్తికాల సభ్యులయ్యాయి.