శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (12:05 IST)

భారత్ - పాకిస్థాన్ సరికొత్త యుద్ధం.. జీతాలు లేక అల్లాడుతున్న పాక్ దౌత్య సిబ్బంది

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరికొత్త యుద్ధం ప్రారంభమైంది. పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ దౌత్యకార్యాలయ సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సరికొత్త యుద్ధం ప్రారంభమైంది. పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ దౌత్యకార్యాలయ సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. నవంబరు నెల వేతనాలు పొందలేకపోతున్నారు. మోడీ నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘన కిందకు వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 
 
డాలర్ల కొరత నేపథ్యంలో పాకిస్థాన్ దౌత్యాధికారులకు భారత బ్యాంకులు పరిమితులు విధించాయి. దౌత్యాధికారులకు డాలర్లలో పన్నులేకుండా జీతాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే భారత్‌లో 5 వేల డాలర్లకు మించి విత్‌డ్రా చేయాలంటే... అందుకు తగ్గ కారణాలు చూపుతూ పత్రాలు సమర్పించాలి. 5 వేల డాలర్లకు దిగువన డ్రా చేయాలంటే ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. 
 
కాగా నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో డాలర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగులకు జీతాల ఖాతాలున్న ఆర్‌బీఎల్ బ్యాంకు... ఎన్ని డాలర్లు విత్‌డ్రా చేయాలన్నా ముందస్తు పత్రాలు సమర్పించాల్సిందేనని స్పష్టంచేసింది. లేదా ఎక్స్చేంచ్ ధరలు చెల్లించి భారత కరెన్సీలో జీతాలు తీసుకోవాలనీ అది కూడా రిజర్వుబ్యాంకు నిబంధనల మేరకే విత్‌డ్రా చేసుకోవాలని తెలిపింది. అదీకాదంటే తమ డబ్బును తిరిగి పాకిస్థాన్ పంపుకోవచ్చునని పేర్కొంది. ఈ మూడు షరతులపైనా పాకిస్తాన్ దౌత్యాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
తమకు జీతాల చెల్లింపులో పరిమితులు విధించడం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని చెబుతూ... తమ దేశంలోని భారత దౌత్యాధికారుల జీతాల చెల్లింపులోనూ ఇదే పరిమితులు విధిస్తామంటున్నారు. కాగా ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు భారత విదేశాంగ అధికారులు వెల్లడించారు. డాలర్ల చెల్లింపులో పరిమితులు విధించడంపై పాకిస్థాన్ హైకమిషన్ స్పందిస్తూ... భారత్ కావాలనే పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ఆరోపించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగానే తమను ఇబ్బంది పెడుతున్నారనీ.. నోట్లరద్దు కారణమే కాదని పేర్కొంది.