యెమెన్ అంతర్యుద్ధం.. భారత్ నుంచి 4 విమానాలు, 5 ఓడలు తరలింపు..!
యెమెన్లో అంతర్యుద్ధం, దాడుల కారణంగా అక్కడున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చే నిమిత్తం భారత ప్రభుత్వం నాలుగు విమానాలను, ఐదు ఓడలను యెమెన్ దేశానికి పంపింది. ఉత్తర యోమెన్ను దిగ్బంధించిన హౌతీ మిలిటెంట్లు వెనక్కు తగ్గి తమ ఆయుధాలన్నిటినీ అప్పగించేవరకూ సౌదీ నేతృత్వంలోని యుద్ధ విమానాలు బాంబు దాడులు కొనసాగిస్తూనే ఉంటాయని అరబ్ లీగ్ చీఫ్ నబిల్-అల్-అరబీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులుగా ఉన్న నాలుగు వేల మందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్నారైల తరలింపు వ్యవహారాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి, జనరల్ వీకే సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సోద్తో మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ప్రధాని విజ్ఞప్తితో సౌదీ రాజు భారతీయుల సురక్షిత తరలింపుకు సహకరిస్తామని పేర్కొన్నట్టు సమాచారం.
ఓమన్, మస్కట్లోని విమానాశ్రయాల ద్వారా అదేవిధంగా యెమెన్కు పడమరగా ఉన్న అల్-హుదయా పోర్టు నుంచి అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్కు తీసుకువస్తారు.