శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (12:27 IST)

అబ్దుల్ కలాం మరణంపై అమెరికా ప్రగాఢ సంతాపం: పత్రికల్లో స్పెషల్ స్టోరీస్

భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మేధావి ఏపీజే అబ్దుల్ కలాం మరణంపై అగ్రరాజ్యం అమెరికా ప్రగాఢ సంతాపం ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో పాటు.. ఆ దేశ మీడియాలు కూడా అబ్దుల్ కలాం మృతిపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దడంలో కలాందే కీలక భూమిక అని ఆ దేశ పత్రికలు ఉటంకించాయి. 
 
ఈ మేరకు సోమవారం మరణించిన కలాంను గుర్తు చేసుకుంటూ ఆ దేశ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. అణ్వస్త్ర, అంతరిక్ష రంగాల్లో భారత్ అభివృద్దికి కలాం విశేష సేవలందించారని తమ కథనాల్లో పేర్కొన్నాయి. రక్షణ రంగంలో భారత్ శక్తిమంతమైన దేశంగా ఎదగడానికి కలాం అవిశ్రాంత కృషి చేశారని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది.
 
పృథ్వీ, అగ్ని లాంటి క్షిపణులను రూపొందించడం ద్వారా భారత రక్షణ వ్యవస్థను కలాం పటిష్ఠం చేశారని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. భారత అంతరిక్ష, రక్షణ రంగాల పటిష్ఠతకు కలాం ఎనలేని సేవలు చేశారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.