లిబియాలో చిక్కుకున్న 1000 మంది ఇండియన్స్!
ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయ కూలీలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఇరాక్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతున్న లిబియాలో కూడా దాదాపు 1000 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టుగా సమాచారం అందుతోంది.
వీరిలో ఎక్కువ మంది తెలుగువారు అందునా కర్నూలు జిల్లా వాసులు కావడం గమనార్హం. అలాగే కేరళకు చెందిన దాదాపు వందమంది నర్సులు కూడా లిబియాలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన వారిలో ఎక్కువమంది కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి వెళ్ళిన సిమెంటు పరిశ్రమ కార్మికులు. లిబియాలో చిక్కుకున్న వెయ్యిమంది కార్మికులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.