భారత్లో గూఢచర్యం కోసం లంక పౌరులు: పాకిస్థాన్ వ్యూహం
భారత్లో గూఢచర్య చేసేందుకు పాకిస్థాన్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ప్రధానంగా భారత కీలక రహస్యాలను, సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా శ్రీలంక పౌరులను ఎరగా వాడుతోంది. ఇందుకోసం పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా శ్రీలంక వాసులను నియమించుకుంటూ తన పనిని సులువుగా కానిచ్చేలా చేస్తోంది. ఐఎస్ఐతో పాటు పాక్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా కూడా ఇదే బాటలో నడుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ, లష్కరే తోయిబాలు అనుసరిస్తున్న ఈ తరహా పన్నాగాలు, ఇటీవల లంకేయుల అరెస్టుల సందర్భంగా వెలుగు చూశాయి.
లంకలోని ముస్లింలను తమ బుట్టలో వేసుకుంటున్న పాక్ సంస్థలు, భారత్ కు సంబంధించిన అత్యంత కీలక రహస్యాలను రాబట్టడంతో పాటు దాడులు చేయాలనుకుంటున్న ప్రాంతాలపై రెక్కీ నిర్వహించేందుకూ వారినే వినియోగిస్తున్నాయి. గడచిన పది నెలల్లోనే ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడిన ముగ్గురు లంకేయులు పట్టుబడ్డారు. తాజా ఘటనలతో పాక్ పన్నాగాలపై మరింత కీలక దృష్టి కేంద్రీకరించాలని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.