శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (14:39 IST)

కిడ్నాప్ చేసిన భారతీయ టీచర్లను ఎందుకు వదిలిపెట్టారో తెలుసా?

సిరియాలో నలుగురు భారతీయ ఉపాధ్యాయులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) వారిలి ఇద్దరిని ప్రాణాలతో వదిలివేయడానికి ఓ కారణం ఉందట. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంటే ఇసిస్ ఉగ్రవాదులకు ఎనలేని గౌరవమట. ఈ విషయాన్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ప్రాణాలతో బయటపడిన ఉపాధ్యాయులు చెపుతున్నారు. 
 
ఇసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో కర్ణాటక, కోలార్ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఉన్నారు. ఈయన కిడ్నాప్‌పై స్పందిస్తూ.. తమను బంధించిన తర్వాత ఓ చీకటి గదిలో ఉంచారని, ఒక రాత్రి అన్నం పెట్టలేదని, తమ పేర్లు, మతం, ఉద్యోగాల వివరాలు అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. తాము వర్శిటీ అధ్యాపకులమని తెలుసుకున్న తర్వాత తమ పట్ల వారి వైఖరి మారిందని తెలిపారు.
 
తన పేరు షేక్ అని చెప్పుకున్న ఉగ్రవాద నాయకుడు, టీచర్లంటే తమకెంతో గౌరవమని, తమను చంపబోమని చెప్పినట్టు వివరించారు. ఇస్లాం గురించి ఏం తెలుసో చెప్పాలని ఆయన ప్రశ్నించాడని, భారత్‌లో మత సామరస్యం గురించి వివరంగా చెబితే సంతోషించాడన్నారు. కాగా, మొత్తం నలుగురిని కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు ఇద్దరిని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు తెలుగువారు ఇంకా వారి చెరలోనే ఉన్నారు.