శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:45 IST)

వరల్డ్ రిచెస్ట్ టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్.. రోజుకు రూ.6 కోట్ల ఆదాయం!

అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలను తమ పాశవిక చర్యలతో గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. ప్రస్తుతం ఈ సంస్థ ఇరాక్, సిరియాల్లో భీకర దాడులతో బెంబేలెత్తిస్తూ.. అక్కడి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు నిక్షేపాలు (బావులు)ను స్వాధీనం చేసుకుంటోంది. ఈ చమురు విక్రయాల ద్వారా రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవిస్తోంది. 
 
ఇది అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఇరాక్, సిరియాల్లోని అనేక చమురు బావులను తన స్వాధీనంలోకి తీసుకున్న భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నట్టు అమెరికా ఆర్థిక శాఖలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘా విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న డేవిడ్ కోహెన్ వెల్లడించారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా పేరుగడించింది. 
 
ఆ సంస్థను నిర్వీర్యం చేసిన తర్వాత ఇసిస్ పుట్టుకొచ్చింది. దీని ఆస్తుల విలువ త్వరలోనే అల్ ఖైదా ఆస్తులను మించిపోనుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఆ సంస్థను నిలువరించేందుకు సుదీర్ఘ సమరమే చేయాల్సి ఉందని కూడా కోహెన్ చెబుతున్నారు. నిత్యం సమకూరుతున్న భారీ ధనంతో ఇసిస్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది. ఇదే తరహాలో ఆ సంస్థ ఎదిగితే ప్రపంచానికి తీవ్ర ముప్పు తప్పదని కోహెన్ హెచ్చరిస్తున్నారు.