బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (16:36 IST)

జపాన్ మంత్రి యుకో ఒబుచి రిజైన్ : మేకప్ కోసం రూ.58 లక్షలు ఖర్చు!

జపాన్ వాణిజ్య మంత్రి యుకో ఒబుచి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తన మేకప్ ఖర్చుల కోసం రూ.58 లక్షలు ఖర్చు చేయడంతో ఆమె మంత్రి పదవికి ఊడిపోయింది. ఈ మొత్తం రాజకీయ పార్టీల కోసం విరాళంగా ఇచ్చిన నిధుల నుంచి తీసి ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. ఇలా మంత్రి పదవిని పోగొట్టుకున్న మహిళ జపాన్ భావి ప్రధానిగా నీరాజనాలు అందుకుంటుండటం గమనార్హం. ఆమె జపాన్ మాజీ ప్రధాని కుమార్తె కావడం గమనార్హం. 
 
ప్రస్తుతం ఆ దేశ కేబినెట్ మంత్రివర్గంలో కీలక మంత్రిగానే కాక జపాన్ భావి ప్రధానిగా మన్ననలందుకుంటున్న యూకో ఒబుచి, తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మేకప్ కోసం చేసిన ఖర్చులే ఒబుచిని రాజీనామా బాట పట్టించాయి. ముమ్మాటికి ఆ ఖర్చులే ఆమె రాజీనామాకు, తన తలనొప్పికి కారణమని జపాన్ ప్రధాని షింజో అబే చెబుతున్నారు. ఒబుచి రాజీనామాకు అబే ఆమోదం తెలిపారు. 
 
అసలు విషయమేంటంటే, జపాన్‌లో రాజకీయ పార్టీలకు, నేతలకు పెద్ద ఎత్తున విరాళాలు అందుతాయి. వీటి వ్యయంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిఘా ఉంటుంది. ఈ నిధులను ఏమాత్రం దుర్వినియోగం చేసినా, సదరు రాజకీయ నేతలతో పాటు వారి పార్టీలు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయ విరాళాలను ఒబుచి ఎంచక్కా తన మేకప్ కోసం వినియోగించారు. సౌందర్య సాధనాలు, ఇతర సామాగ్రి కోసం ఒబుచి ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్‌లో ఏకంగా రూ.58 లక్షల మేర ఖర్చు చేశారట. 
 
2012లో ఖర్చైన ఈ నిధులన్నీ ఆమెకు అందిన రాజకీయ విరాళాలకు చెందినవేనని తాజాగా ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో దేశానికి తొలి మహిళా ప్రధానిగా రికార్డులకెక్కుతారనుకున్న ఒబుచి, అబే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అబే కేబినెట్‌లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహాల మంత్రిగా ఆమె కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వచ్చారు.