శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (09:42 IST)

ఆ వ్యక్తి రక్తంలో మ్యాజిక్ మష్రూమ్స్ పుట్టాయి.. ఎలాగంటే..?

mushroom tea
మానసిక రోగంతో బాధపడుతున్న ఓ యువకుడు వైద్యులు సూచించిన మందులు కాకుండా ఇంటర్నెట్‌లో చూసి సొంత వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎలాగంటే..? 30 ఏళ్ల యువకుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. అయితే, వాటి నుంచి బయటపడాలన్న ప్రయత్నంలో మానసిక వ్యాధికి గురయ్యాడు. అతడికి బైపోలార్‌ డిజార్డర్‌ కూడా ఉంది. దీంతో వైద్యులు అతడికి కొన్ని మందులు సూచించారు. 
 
కానీ, ఆ యువకుడు వాటిని వేసుకోవడం మానేసి సొంత వైద్యంపై దృష్టి పెట్టాడు. ఈ మేరకు ఇంటర్నెట్‌లో అన్వేషించగా.. మానసిక ఆందోళనను, ఒత్తిళ్లను దూరం చేయడంలో సిలోసెబిన్‌ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు. వాటిని మ్యాజిక్‌ మష్రూమ్స్ అని కూడా పిలుస్తుంటారు. నిజంగానే ఈ రకం పుట్టగొడుగులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. వీటితో వైద్యులు మెడికల్‌ ట్రయల్స్‌ కూడా చేస్తున్నారు.
 
ఈ పుట్టగొడుగులను లేదా వాటితో తయారు చేసిన మందుల్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది. కానీ, ఆ యువకుడు మరో మార్గం ఎంచుకున్నాడు. పుట్టుగొడుగులను రక్తంలోకి ఎక్కించుకుంటే మరింత మంచి ఫలితమొస్తుందని భావించాడు. ఇందుకోసం పుట్టగొడుగులను మరగబెట్టి టీ తయారు చేశాడు. ఆ టీని ఇంజక్షన్‌ రూపంలో తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు అంతే.. రెండు రోజులకే యువకుడు అస్వస్థతకు గురవడం మొదలైంది. మొదట నీరసం, రక్తంతో వాంతులు జరిగాయి. ఆ తర్వాత కామెర్లు, డయేరియా వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
 
బాధితుడికి అనేక పరీక్షలు నిర్వహించిన వైద్యులు నివేదికలు చూసి ఆశ్చర్యపోయారు. అతడి శరీరంలోని అన్ని అవయవాల పనితీరు క్షీణిస్తున్నట్లు తేలింది. అతడు తీసుకున్న పుట్టగొడుగుల టీ వల్ల రక్తంలో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభించాయి. అతడి రక్తంలో బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ జరిగినట్లు గుర్తించారు. దీంతో యువకుడిని కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. డయాలసిస్‌ చేసి రక్తాన్ని శుభ్రపర్చారు. 
 
ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి మందులు ఇచ్చారు. అలా 22 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందడంతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుండటంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు.