గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:31 IST)

భార్యతో గొడవ వల్ల విమానాన్ని హైజాక్ చేసాడు..

బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఉగ్రవాద చర్యలలో భాగంగా దుండగులు ప్లైట్‌లను హైజాక్ చేసిన సంఘటనలను చూసాం, అయితే ఓ వ్యక్తి కేవలం వ్యక్తిగత కారణాలతోనే విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే సదురు వ్యక్తి ఈ సాహసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే, ఛత్రోగ్రామ్‌ విమానాశ్రయం నుంచి 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్‌ వెళ్తున్న బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని నిందితుడు దారి మళ్లించేందుకు ప్రయత్నించాడు. విమానం బయల్దేరిన కాసేపటికే ఆ వ్యక్తి తన వద్ద పిస్తోలు, అలాగే పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ అందరినీ బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. తనకూ తన భార్య మధ్య గొడవలు ఉన్నాయని, ఇదే విషయమై బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో వెంటనే మాట్లాడాలంటూ నిందితుడు పదేపదే డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 
అప్రమత్తమైన పైలట్‌లు విమానాన్ని వెంటనే ఛత్రోగ్రామ్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. ఉన్నతాధికారులు హైజారక్‌తో చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుండి దింపేందుకు హైజాకర్‌ ఒప్పుకున్నాడు. వారందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కమాండోలు వచ్చి అతడిని లొంగిపోవాలని హెచ్చరించారు. అతడు అంగీకరించకపోవడంతో కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 
 
నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు. పేలుడు పదార్థాలు అతడి వద్దకు ఎలా వచ్చాయి, అలాగే వాటిని విమానంలోకి ఎలా తీసుకువచ్చాడని మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే నిందితుడితో చర్చలు జరిపే సమయంలో అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించినట్లు వారు తెలిపారు.