మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (13:06 IST)

ముంబై వాసులకు ధన్యవాదాలు చెప్పిన పాకిస్థాన్ తల్లి.. ఎందుకు..?

భారతీయుల ఉదార గుణానికి ఓ పాకిస్థాన్ తల్లి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. ఓ వైపు శివసేన కార్యకర్తలు పాకిస్తాన్‌పై మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఓ పాకిస్థాన్ బాలిక కోసం భారతీయులు సహాయం చేశారు. చికిత్స కోసం భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ చిట్టితల్లికి అవసరమైన లక్షలాది రూపాయలను భారతీయులు దానమిచ్చారు.  
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలో ఉన్న 15 ఏళ్ల బాలిక  సబా తారిఖ్ అహ్మద్ విల్సన్ డిసీజ్ అనే వ్యాధితో బాధపడుతూ వచ్చింది. ఈ వ్యాధి చికిత్స కోసం తన తల్లి నజియాతో కలిసి సబా ఇండియా వచ్చింది. శరీరంలో కాపర్ స్థాయి పెరగడంతో రక్తంలో అది విషంగా మారుతుంది. తద్వారా ప్రాణాలను హరిస్తుంది. దీనికి చికిత్స చేయాలంటే లక్షలు వెచ్చించాలి. అయితే పాకిస్థాన్ తల్లి వద్ద అంత డబ్బుల్లేకపోవడాన్ని గమనించిన బ్లూబెల్స్ కమ్యూనిటీ అనే ఎన్జీవో సంస్థ.. సామాజిక మాధ్యమాల ఆధారంగా ముంబై వాసుల నుంచి రూ.7లక్షలు సమీకరించింది. 
 
ఇలా వందలాది మంది చేసిన సాయంలో రూ.13లక్షల నిధి ఏర్పడింది. దీంతో పాకిస్థాన్ బాలికకు చికిత్స పూర్తయ్యింది. అంతేగాకుండా ఆరోగ్యవంతురాలిగా ఆ పాక్ బాలిక కరాచీకి బయల్దేరింది. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స అందించిన జస్ లోక్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ తరణ్ జ్ఞాన్ చందానీ చెప్పారు. తన బిడ్డ బతికి బయటపడేందుకు సహకరించిన భారతీయులకు, వారి ఉదార గుణానికి ఆ తల్లి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.