గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (14:58 IST)

నా ప్రేయసి మోసం చేసింది, చనిపోతున్నా, నా అవయవాలు దానం చేయండి: కెనడా నుంచి తెలుగు యువకుడు

ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు కొద్దిమంది విదేశాలకు వెళ్లి ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరంగా మారుతోంది. తమ వ్యక్తిగత సమస్యలతో కొందరు చనిపోతుంటే మరికొందరు తమ ప్రేమలు విఫలమయ్యాయంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.
 
తన ప్రియురాలు మోసం చేసిందనే కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన హైదరాబాద్‌ యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ నైట్రోజన్‌ గ్యాస్‌ పీల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాదుకు చెందిన ప్రణయ్ అనే యువకుడు కెనడాలో వుంటున్నాడు. ఐతే తన ప్రేమించిన అమ్మాయి తనతో వుంటూనే తనకు హైచ్ 1 వీసా రాగానే ఇక్కడ నుంచి తనను వదిలి వెళ్లిపోయిందనీ, తనకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందనీ, ఎంత ప్రయత్నించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసాడు.
 
ఆమె తనను మోసం చేసిందని గ్రహించాననీ, ఆమె లేని జీవితం తనకు సాధ్యం కావడంలేదని, అందువల్ల ఆత్మహత్య ఒక్కటే మార్గమని ఆ పని చేస్తున్నానంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తను చనిపోయిన అనంతరం తన అవయవాలను దానం చేయాలని కూడా అందులో పేర్కొన్నాడు.

అంతేకాదు... తన ప్రియురాలి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు యూ ట్యూబులో 15 నిమిషాల నిడివి గల వీడియోను కూడా పోస్టు చేసాడు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఈ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలియగానే అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.