నరేంద్ర మోడీకి అమెరికా రెడ్ కార్పెట్ స్వాగత ఏర్పాట్లు!
ఈనెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. గతంలో మోడీపై ఆంక్షలు పెట్టి వీసాను రద్దు చేసిన అమెరికా.. ఆయన ప్రధాని అయ్యాక ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే.
ప్రధాని పదవి చేపట్టిన అనంతరం నరేంద్ర మోడీ తొలిసారి అమెరికా పర్యటనకు సిద్ధమైయ్యారు. ఈ తరుణంలో అమెరికా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కసరత్తులు చేస్తోంది. ఈనెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శ్వేతసౌధంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
మోడీతో అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండురోజుల పాటు సమావేశం కావాలని నిర్ణయించినా.. 29వ తేదీన మాత్రమే ఒబామాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ముందుగా వైట్హౌస్లో ఒబామాతో కలిసి మోడీ అధికారిక విందులో పాల్గొంటారు. ఇదిలావుండగా మరుసటి రోజు అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్తో సమావేశం అవుతారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.