మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (03:20 IST)

ఒక్కసారి అమెరికాను వదిలి వెళ్లారో తిరిగి రావడం కల్లే..

ఉగ్రవాదులను దేశంలోకి రానీయకుండా చూడటం అంటే అంత నాజూగ్గా ఉంటుందా, 3 లక్షలమంది విదేశీ విమాన ప్రయాణికులను తనిఖీ చేసి కేవలం 300 మందిని మాత్రమే అనుమానంపై నిర్బంధిస్తే వాళ్లకోసం ఇంతగా కన్నీళ్లు కారుస్తారా..

ఉగ్రవాదులను దేశంలోకి రానీయకుండా చూడటం అంటే అంత నాజూగ్గా ఉంటుందా, 3 లక్షలమంది విదేశీ విమాన ప్రయాణికులను తనిఖీ చేసి కేవలం 300 మందిని మాత్రమే అనుమానంపై నిర్బంధిస్తే వాళ్లకోసం ఇంతగా కన్నీళ్లు కారుస్తారా.. అంటూ అమెరికన్లలోని మానవీయ కోణాన్ని కూడా చంపేస్తున్న ట్రంప్ వాస్తవానికి కొన్ని వేలమంది నిజజీవితాలను కలగా కాదు కల్లోలంగా మార్చిపడేశారు. దేశాధ్యక్షుడి ఒక కఠిన నిర్ణయం పొరపాటున అమెరికానుంచి స్వదేశానికి ప్రయాణం పెట్టుకున్న వారి ఆశలను నిలువునా కూల్చేస్తోంది. ఏడు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించని క్రూర ఆంక్షలకు బలైపోయిన వారి బాధామయ గాధల్లో ఈ ఇరాన్ మహిళా ప్రొఫెసర్ ఉదంతం ఒకటి.  
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతంగా చాలామందిని ఇబ్బంది పెడుతోంది. వారి నిజజీవితాలను కూడా కలగా మార్చేస్తోంది. అప్పటి వరకు అమెరికాలో ఉన్నవాళ్లు ట్రంప్‌ తెచ్చే చిక్కులు తెలియక బయటకు వెళ్లి తిరిగి అమెరికాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అందుకు తార్కాణంగా ఇరాన్‌కు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో పెట్టిన విషాదకరమైన పోస్ట్‌ అందరి హృదయాలను కరిగిస్తోంది. ఆమె తెలిపిన వివరాలివి.
 
ఆమె పేరు నజానిన్‌ జినౌర్‌. గత ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటోంది. ప్రస్తుతం దక్షిణ కరోలినాలోని క్లెమ్సెన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. ఏటా ఇరాన్‌లో ఉండే తన తల్లిదండ్రులను చూసేందుకు వెళుతుంటోంది. అందులో భాగంగానే ఈసారి కూడా తల్లి దండ్రుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే, ట్రంప్‌ నిర్ణయం వెలువడకముందే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తనకు అలాంటి పరిస్థితి ఎదురవ్వదులే అని అనుకుంది. అయినా, వాటన్నింటిని కూడా రూమర్లుగానే భావించింది. దీంతో గతంలో మాదిరిగానే ఈ నెల (జనవరి) 20న ఇరాన్‌కు వెళ్లింది.
 
టెహ్రాన్‌ వెళ్లే సమయంలో ఎంతో సంతోషంగా వెళ్లింది. తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది. బుధవారంనాటికి రూమర్లు మరింత వేగం పుంజుకున్నాయి. వీసా నిబంధనలు మారుతున్నాయంటూ మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో అప్పటికప్పుడు ఆమె టికెట్‌ బుక్‌ చేసుకొని దుబాయ్‌కి చేరింది. అక్కడ కొన్నిగంటలు ప్రశ్నించిన తర్వాత వాషింగ్టన్‌ విమానం కూడా ఎక్కింది. అయితే, అందులోని సిబ్బంది మాత్రం ఆమెను విమానంలో నుంచి దించేశారు.
 
అలా ఆమెకు ఏడేళ్లుగా అమెరికాతో ఉన్న బంధం తెగిపోయినట్లు బాధపడుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టింది. అమెరికాలోని ఎయిర్‌ పోర్ట్‌లో ఉన్న తన కారు పరిస్థితి ఏమిటి? ఇంట్లోని తన కుక్క పిల్లలను ఎవరు చూస్తారు? నా ఇల్లు ఎలా? నా వస్తువులు ఎలా? నా ఉద్యోగం ఎటుపోవాలి అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు సందిస్తూ ముగించింది.