శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (15:36 IST)

నేపాల్‌లో ఎమర్జెన్సీ... ఇప్పటికి 150 మృతదేహాల వెలికితీత..

భారీ భూకంపం ధాటికి నేపాల్‌లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కూలిన భవనాల కింద చిక్కుకుని అనేక మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 మృతదేహాలను వెలికితీశారు.
 
మరోవైపు.. భూకంప తీవ్రత అధిక స్థాయిలో ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పురాతన కట్టడాలు, భవనాలు, చారిత్రక కట్టడాలు నేలకొరిగాయి. ఖాట్మండులో భారీ ప్రాణ నష్టం జరిగింది. క్షతగాత్రులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి. 
 
శిథిలాల కింద భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఖాట్మండులో 62 మీటర్ల చారిత్రక ధరహర టవర్ కూలింది. దాని కింద పలువురు పౌరులు చిక్కుకున్నట్టు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. 
 
ఇంకోపైవు.. నేపాల్ కేంద్రంగా వచ్చిన భూకంపం తర్వాత ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. భూ ఉపరితలానికి 11.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్‌‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. 
 
ఖాట్మండులో ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండడంతో విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఖాట్మండులో దిగాల్సిన అన్ని రకాల విమానాలను సమీపంలోని భారత ఎయిర్ పోర్టులకు మళ్లించారు.