శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 24 జనవరి 2015 (18:32 IST)

ఒబామా ఎయిర్‌ఫోర్స్ వన్ టేకాఫ్ 7 ఏఎం.. భారత్ రాక 10 ఏఎం!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ భారత కాలమానం ప్రకారం 5.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలు) వాషింగ్టన్ డీసీలోని డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరారు. ఈ విమానం న్యూఢిల్లీలోని పాలం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం (జనవరి 25వ తేదీ) 10 గంటలకు చేరుకోనుంది. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, భద్రతా దళానికి చెందిన అధికారులు కూడా భారత్కు అదే విమానంలో బయల్దేరారు. 
 
తన భార్య మిషెల్లీతో వచ్చే ఒబామా ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత నేరుగా విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌర్య షెరటాన్ నక్షత్ర హోటల్‌కు చేరుకుంటారు. కొద్దిసేపు సేదతీరిన తర్వాత ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఇక్కడ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారీకర్, వెంకయ్య నాయుడులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తారు. 
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అలాగే, మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మోడీతో కలిసిన ఒబామా పాలు పంచుకుంటారు. రేడియో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు మోడీ, ఒబామాలు సమాధానం ఇస్తారు. కాగా, ఒబామా వెంట వచ్చే అమెరికా అధికార, అనధికార ప్రతినిధి బృందానికి 400 పైచిలుకు గదులు ఉన్న హోటల్ మొత్తాన్ని కేటాయించనున్నారు. ఈ హోటల్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఒబామా దంపతులు మూడు రోజులు పాటు ఉంటారు. 
 
ఇదిలావుండగా, స్వతంత్ర భారతావని చరిత్రలో న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షులు కేవలం ఆరుగురు మాత్రమే. వీరిలో ఒబామా ఈ పర్యటనతో కలుపుకుంటే రెండుసార్లు వచ్చినట్టు. 1959లో తొలిసారి అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్ భారత్‌ను సందర్శించారు. అనంతరం పదేళ్ళ తర్వాత 1969లో రిచర్డ్ నిక్సన్ భారత్‌ను సందర్శించారు. ఆయనే భారత్‌తో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు నాంది పలికారు. ఆ తర్వాత 1979లో జిమ్మీ కార్టర్ భారత్‌ను సందర్శించారు. 
 
సుదీర్ఘ విరామం తర్వాత 2000లో బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటించి అమెరికా, భారత్ బంధాన్ని పటిష్టం చేశారు. ఆ తర్వాత 2006లో వచ్చిన జార్జ్ డబ్ల్యూ.బుష్. జూనియర్ వాటిని మరింత బలోపేతం చేశారు. 2010లో ఒబామా పర్యటనతో భారత్‌తో అమెరికా మైత్రి విడదీయలేనంత పటిష్టమైంది. దీంతో ఒబామా మరోసారి భారత్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. భారత్, అమెరికా దేశాల పరస్పర సహకారం ప్రపంచాభివృద్ధికి ఎంతో కీలకమని రెండు దేశాల అధినేతలు పేర్కొంటున్నారు.