పెషావర్ సైనిక పాఠశాల దాడి పేరు 'పాకిస్థాన్ 9/11' : నవాజ్ షరీఫ్
పెషావర్ సైనిక పాఠశాలపై ఈనెల 16వ తేదీన జరిగిన దాడిని పాకిస్థాన్ 9/11గా ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నామకరణం చేశారు. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే.
అంతేగాక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీకి సాయం చేస్తామని ఆఫ్ఘన్ నాయకత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరూ కలసి పాక్, ఆఫ్ఘన్ సరిహద్దులో తీవ్రవాదులపై కార్యకలాపాలు కొనసాగిస్తారని తెలిపారు. మరోవైపు... పెషావర్ దారుణ ఘటన అనంతరం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లలో ఉగ్రవాదులపై సైనిక దాడులను ముమ్మరం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్లో గత 48 గంటల నుంచి కొనసాగిన దాడుల్లో ఏకంగా 141 మంది తాలిబన్లను హతమార్చారు. కునార్, ఉరుంగజ్, బాల్క్, హెల్మాండ్, ఘంజీ, నాన్ గార్హర్ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగినట్టు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దాడుల సమయంలో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని తెలిపింది. భారీ ఆయుధాలు, బాంబులతో తాలిబన్లు ఎదురు దాడికి దిగినట్టు తెలిపింది.