బెయిలిచ్చినా 3 నెలల పాటు పాకిస్థాన్ ప్రభుత్వ అదుపులోనే లఖ్వీ!!
ముంబై దాడి కేసులో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ముంబై దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ మరో మూడు నెలలు జైలులోనే గడపాల్సి ఉంటుంది. లఖ్వీకి బెయిల్ మంజూరు తర్వాత భారత్తో పాటు అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున విమర్శలు రావడంతో మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ (ఎంపీవో) కింద మూడు నెలల పాటు అతడిని నిర్బంధంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాస్తవానికి లఖ్వీ శుక్రవారం ఉదయం రావల్పిండి జైలు నుంచి విడుదల కావలసి ఉంది. లఖ్వీ నిర్బంధం విషయంపై పాకిస్థాన్ భారత ప్రభుత్వానికి కూడా సమాచారమందించింది. అయితే, పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన మరుసటి రోజే లఖ్వీకి బెయిల్ మంజూరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పాక్ ప్రభుత్వం మరో మూడు నెలల పాటు నిర్బంధంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.