శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (18:44 IST)

చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్‌పై భారత్ స్పందన అనవసరం: పాకిస్థాన్

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఏర్పాటయ్యే చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పీవోకే గుండా పాకిస్థాన్‌లోని గ్వదర్ పోర్టు వరకు ఈ ఎకనామిక్ కారిడర్ నిర్మితం కానుంది.

అయితే ఈ ప్రాజెక్టు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఏర్పాటు కావడం ఆమోదయోగ్యం కాదని భారత్ అంటోంది. ఇదే విషయాన్ని చైనా అధినాయకత్వం వద్ద కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. అందుకు చైనా బదులిస్తూ... ఇది రాజకీయ కారిడార్ కాదని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కారిడార్ అని స్పష్టం చేసింది.
 
అలాగే భారత్ అభ్యంతరాలను పాకిస్థాన్ కూడా తోసిపుచ్చింది. ఎకనామిక్ కారిడార్ అంశంపై భారత్ స్పందన అనవసరమని, చెప్పాల్సి వస్తే, ఇది పాక్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టేనని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ అన్నారు. పొరుగు దేశాలన్నింటితో కనెక్టివిటీ పెంపొందించుకునేందుకే ప్రయత్నిస్తున్నామని, ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా భారత్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలు కూడా లబ్ది పొందుతాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. 
 
ఈ కారిడార్ విషయంలో భారత్ స్పందన ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. భారత్ నేతలు, పార్లమెంటు తమ ప్రాజెక్టుపై చురుగ్గా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టును సానుకూల దృక్పథంతో చూడడం భారత్‌కు మంచిదని తెలిపారు. అలా కాకుండా, ఈ ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదని పేర్కొనడం వారి అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు.