ఎంక్యూఎంకు భారత్ నిధులు: ఐరాస ముందు పాకిస్థాన్ కొత్త కథ.. రచ్చకు రె''ఢీ"
ఐక్యరాజ్యసమితిలో భారత్ను దోషిగా నిలపాలని పాకిస్థాన్ గట్టిగా నిర్ణయించుకుంది. పాకిస్థాన్లో అస్థిరతకు కారణం భారత్కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని పాక్ ఇటీవలే ఆరోపించిన నేపథ్యంలో.. భారత్ను దాయాది దేశం రచ్చకీడ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ సమాజంలో తమను దోషిగా నిలబెట్టేందుకు భారత్ యత్నిస్తుందని పాకిస్థాన్ ఎప్పటి నుంచో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై ప్రత్యారోపణలతో పాకిస్థాన్ విరుచుకుపడుతోంది.
ఈ క్రమంలో ముత్తాహిదా క్వామి మూవ్ మెంట్ (ఎంక్యూఎం)కు భారత్ నిధులు అందిస్తోందని, తద్వారా కరాచీలో అస్థిరత సృష్టించాలని భావిస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ విషయమై ఐక్యరాజ్యసమితిలో భారత్ను దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్ డిసైడ్ అయ్యింది. అయితే తమకు భారత నిఘా సంస్థ 'రా'తో ఎలాంటి సంబంధాలు లేవని, భారత్ నుంచి తామెలాంటి నిధులు అందుకోలేదని ఎంక్యూఎం వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ క్లియర్ కట్గా చెప్పేశారు.
కానీ భారత్ ఎంక్యూఎంకు నిధులు ఇచ్చిందనేందుకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాకిస్థాన్ చెబుతోంది. తమకు భారత్ నుంచి నిధులు అందాయని లండన్లో ఇద్దరు ఎంక్యూఎం నేతలు మెట్రోపాలిటన్ పోలీస్ విభాగానికి చెప్పారని, దానికి సంబంధించిన స్టేట్ మెంట్ ప్రతుల కోసం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాశామని పాక్ పేర్కొంది.
ఈ క్రమంలోనే ఐరాసలో తన రాయబారి మలీహా లోథీని పాక్ సర్కారు ఇస్లామాబాద్ పిలిపించింది పాక్ సర్కారు. ఆమెతో ఈ విషయమై కూలంకషంగా చర్చించింది. కాగా, పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. పాకిస్థాన్ వ్యవహారాల్లో తామెలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. దీనిని బట్టి ఏవిధంగానైనా భారత్ను రచ్చకీడ్చి.. ఐరాస ముందు దోషిగా నిలబెట్టేయాలని పాకిస్థాన్ భావిస్తోంది.