కాశ్మీర్ అంశంతో అంతర్జాతీయ అలజడికి నవాజ్ షరీఫ్ నిర్ణయం
కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా చేసుకుని అంతర్జాతీయంగా అలజడి సృష్టించాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నిర్ణయించారు. ఇందుకోసం 22 మంది ఎంపీలను ఎంపిక చేసి.. 22 దేశాల రాజధానులకు ప్రత్యేకంగా పంపుతున్నా
కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా చేసుకుని అంతర్జాతీయంగా అలజడి సృష్టించాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నిర్ణయించారు. ఇందుకోసం 22 మంది ఎంపీలను ఎంపిక చేసి.. 22 దేశాల రాజధానులకు ప్రత్యేకంగా పంపుతున్నారు. దీంతో భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య దౌత్యయుద్ధం ముదిరే అవకాశం ఉంది. 'కాశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారంపై తానిచ్చిన వాగ్దానాన్ని ఐక్యరాజ్యసమితికి గుర్తుచేస్తాం' అని ఈ సందర్భంగా ఇస్లామాబాద్లో అన్నారు.
బలూచిస్థాన్లో పాక్ సైన్యం అకృత్యాలపై ఈనెల 15న ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ విమర్శలు గుప్పించడంతో రెండు దేశాల మధ్య వాగ్యుద్ధం జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంశానికి అన్ని దేశాల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించాలని ప్రత్యేక దూతలకు షరీఫ్ సూచించారు. వచ్చేనెల ఐరాస భేటీలో అంతర్జాతీయ సమాజాన్ని కదిలించేలా ప్రసంగించి, స్పందన రాబట్టేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని రేడియో పాకిస్థాన్ ప్రకటించింది.
మరోవైపు బలూచిస్థాన్లో పాక్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు అంతేలేదని బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రహుమ్దగ్ బుగ్తీ ఆరోపించారు. బలూచ్లో పాక్ బలగాలు హక్కుల ఉల్లంఘన సునామీని సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్తో ఇంకెంతమాత్రం కలిసి ఉండలేం అని ఆయన వ్యాఖ్యానించారు. గగనతల దాడులు, టియర్గ్యాస్ ప్రయోగం నిత్యకృత్యమైనట్లు పేర్కొన్నారు.