మోడీ పనితీరుతో పాకిస్థాన్ ఏకాకి... చైనా ఒక్కటే దోస్త్.. పాక్ పొలిటికల్ అనలిస్ట్ విశ్లేషణ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో పాకిస్థాన్ ఏకాకి అయ్యిందనీ, పాక్ మిత్రదేశాలన్నింటినీ హైజాక్ చేశారనీ, ఇకపై ఒక్క చైనా మాత్రమే దోస్త్గా ఉంటుందని పాకిస్థాన్కు చెందిన పొలిట
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో పాకిస్థాన్ ఏకాకి అయ్యిందనీ, పాక్ మిత్రదేశాలన్నింటినీ హైజాక్ చేశారనీ, ఇకపై ఒక్క చైనా మాత్రమే దోస్త్గా ఉంటుందని పాకిస్థాన్కు చెందిన పొలిటికల్ అనలిస్ట్ సయ్యద్ జైద్ జమాన్ హమిద్ అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానంలో మోడీ అనుసరిస్తున్న దూకుడు ముందు పాకిస్థాన్ కుదేలు కావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై ఆయన ఓ టీవీ చానెల్తో స్పందిస్తూ.. 'మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారంటే తమ దేశ భద్రత గురించి ఆలోచిస్తారు. పాకిస్థాన్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచేందుకు వ్యూహాలు రచిస్తారు. ఆసియాలో పాక్ను ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తారు. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ విదేశాలకు వెళ్లారంటే తన బిజినెస్ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. తన అవినీతిని దాచిపెట్టుకోడానికి విదేశీ పర్యటనలను ఉపయోగించుకుంటారు. జాతి ప్రయోజనాల కోసం పాకిస్థాన్ ప్రధాని ఎవరూ ఎలాంటి చర్యా తీసుకున్నట్లు కనిపించదన్నారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీ భారత జాతి ప్రయోజనాల కోసం ఎంతగా కృషి చేశారంటే ఆసియాలో పాకిస్థాన్కు చైనా తప్ప మరెవ్వరూ దోస్తు మిగలకుండా చేశారు' అని జైద్ విశ్లేషించారు. మోడీ విదేశాంగ విధానం వల్ల పాక్ ఇప్పటికే ఆసియాలో ఏకాకి అయ్యిందన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్కు పాతకాలంనాటి మిత్ర దేశాలన్నింటినీ మోడీ దాదాపు హైజాక్ చేశారన్నారు.
మోడీకి సౌదీ అరేబియాలో అనూహ్య స్వాగతం లభించింది. ఆ దేశంతో భారత సంబంధాలు పటిష్టమయ్యాయి. ఇరాన్తో కూడా భారత మైత్రి బలపడింది. భారత్ అఫ్ఘాన్ను పాక్ నుంచి ఇదివరకే దూరం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్కు అమెరికాతో సంబంధాలు చెడిపోగా... ఇరాన్తో ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థానీయులను బంగ్లాదేశ్ ఉరితీస్తోంది. దీనికంతటికీ కారణం పాకిస్థాన్కు విదేశాంగ మంత్రి, స్పష్టమైన విదేశాంగ విధానం లేకపోవడమే. దేశ భద్రతను కాపాడేందుకు ప్రధాని ఒక చర్య కూడా తీసుకోలేకపోయారు అంటూ ఆయన ధ్వజమెత్తారు.