గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (18:02 IST)

పాక్ గుండెల్లో గుబులు.. వెలవెలబోతున్న పాక్ నౌకాశ్రయాలు..

భారత్ బాలాకోట్‌పై చేసిన దాడి అనంతరం పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని అమోమయ పరిస్థితిలో పడిపోయింది. తనను తాను రక్షించుకోవడానికి వీలైనన్ని మార్గాలను వెతుకుతోంది. కొన్ని రోజుల క్రితం వరకూ కళకళలాడుతూ దర్శనమిచ్చిన పాక్ నౌకాశ్రయాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నావికాదళం అంతా ఆ ప్రదేశాలను ఖాళీ చేసేసి సముద్రంలోకి ప్రవేశించింది. 
 
నిఘావర్గాల విశ్లేషణలో ఇది వెల్లడైంది. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో మన నావికాదళం ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో కరాచీ రేవును ధ్వంసం చేసింది. అప్పుడు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోవడానికి పాక్‌కి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందేమోనని వణికిపోతున్నారు. పాక్‌ నావికాదళంలోని నౌకలు ప్రధానంగా కరాచీ, ఒర్మార, గ్వాదర్‌ నౌకాశ్రయాల్లో ఉంటాయి.
 
ఫిబ్రవరి 28 వరకూ ప్రధాన నౌకలన్నీ అక్కడే కనిపించాయి. తొమ్మిది ఫ్రిగేట్లు,  ఎనిమిది సబ్‌మెరైన్లు, మరో 17 గస్తీ, ఇతర నౌకలు ఉండే ప్రదేశం అకస్మాత్తుగా ఖాళీ అయిపోయింది. ఉపగ్రహ చిత్రాలలో ఇది స్పష్టంగా దర్శనమిస్తోంది. కరాచీలోని పాక్‌ ప్రధాన నౌకలు, సబ్‌మెరైన్లు, ఫ్రిగేట్ల, మిసైల్‌ బోట్లు,  గస్తీ నౌకలు అన్నీ కూడా ఫిబ్రవరి 26 నాటికి ఖాళీ చేసేశారు. 
 
దాడి జరిగిన రెండు రోజుల్లోనే ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. చైనా నిర్మిస్తున్న గ్వాదర్‌ పోర్టు వీడి పాక్‌ నావికాదళం మార్చి 6వ తేదీ నాటికి సముద్రంలోకి వెళ్లిపోయింది. అదే విధంగా ఒర్మార పోర్టు నుండి కూడా యుద్ధ నౌకలు సముద్రంలోకి వెళ్లాయి. భారత్ దాడి అనంతరం పాక్ నావికాదళం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది.