శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (11:10 IST)

పెషావర్ దాడులకు భారతే కారణం: పర్వేజ్ ముషారఫ్ ఆరోపణ

పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడుల అనంతరం భారత్ అందించిన మద్దతును పాకిస్థాన్ నేతలు ప్రశంసిస్తుంటే, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ మాత్రం దాడులకు భారతదేశమే కారణమంటున్నారు. 
 
తెహ్రీక్-ఏ-తాలిబన్ కమాండర్ మౌలానా ఫజులుల్లా ఓ ఆఫ్ఘన్ జాతీయుడని, అతడికి శిక్షణ ఇచ్చింది భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) అని ఆరోపించారు. చిన్నారులను చంపిన తాలిబన్లకు శిక్షణ ఇచ్చిందే భారతేనని ఉద్ఘాటించారు. పాకిస్థాన్ వ్యాప్తంగా దాడులు చేసేందుకు భారత్, ఆఫ్ఘన్ దేశాలు తాలిబన్ కమాండర్‌కు సహకరిస్తున్నాయని అన్నారు. 
 
భారత్‌పై విషం కక్కే జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ కూడా పెషావర్ దాడులకు భారత్‌నే వేలెత్తి చూపిస్తున్నాడు. సైనిక పాఠశాలపై తాలిబన్ల దాడి వెనుక భారత్ హస్తం ఉందన్నాడు.
 
అంతేగాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలకు దన్నుగా భారత్ తన బలగాలను పంపితే, కాశ్మీర్‌లోని తమ సహోదరులకు సాయపడేందుకు ముజాహిదిన్‌లు ముందుకు కదులుతారని హెచ్చరించారు. సాయం కోసం కాశ్మీరీలు ఎలుగెత్తుతున్నారని, వారికి సాయపడడం తమ ధర్మం అని హఫీజ్ పేర్కొన్నాడు.