శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (16:26 IST)

జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయా : పాకిస్థాన్ కాటికాపరి!

అతనో ప్రొఫెషనల్ కాటికాపరి. అతని డిక్షనరీలో కన్నీళ్లన్న పదానికి తావులేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఎన్నో మృతదేహాలను ఖననం చేశారు. ఎంతో మంది దుఃఖాన్ని కళ్ళారా చూశాడు. కానీ, అతను ఏనాడు కూడా భావోద్వేగాలకు గురికాలేదు. అతనే కాదు అతని ఇద్దరు కుమారులు కూడా మృతదేహాలను ఖననం చేయడమే వృత్తిగా ఎంచుకున్నారు. పొట్టకూటి కోసమే శవాలను ఖననం చేస్తున్నా, తానేనాడు బాధ, విచారం వంటి భావోద్వేగాలను ప్రదర్శించలేదు. 
 
అలాంటి ప్రొఫెషనల్ కాటికాపరి ఆ మృతదేహాలను ఖననం చేసేటపుడు జీవితంలో ఎన్నడూ ఏడవనంత తీవ్రంగా విలపించాడు. అతని కళ్ళలో నుంచి కన్నీరు నీటి ప్రవాహంలా వచ్చింది. అతనే.. పెషావర్ శ్మశానవాటిక కాటికాపరి తాజ్ మహమ్మద్. అభంశుభం తెలియని అమాయక చిన్నారు... మతమౌఢ్యానికి బలైపోయారు. తాలిబన్ ఉగ్రవాదుల తుపాకీ గుళ్ళకు వారు పిట్టల్లా రాలిపోయిన వార్తలు విని చలించిపోయాడు. 
 
పెషావర్ సైనిక పాఠశాలలో ఉగ్రవాదుల మారణహోమంలో మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తూ తాజ్ మహహ్మద్ విలపించిపోయాడు. దీనిపై అతని స్పందిస్తూ.. 'గతంలో చాలా మంది మృతదేహాలను ఖననం చేశాను. వీరిలో విభిన్న వయసు, ఎత్తు, బరువు ఉన్న వారు ఉన్నారు. అయితే ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన చిన్నారుల మృతదేహాలను ఖననం చేస్తున్నప్పుడు చాలా భారంగా అనిపించింది. జీవితంలో తొలిసారి కన్నీళ్లను ఆపుకోలేకపోయాను' అని చమర్చిన కళ్ళతో చెప్పుకొచ్చాడు.