శ్రమిస్తే 21వ శతాబ్దం మనదే.. ఆసియా దేశాలకు మోడీ పిలుపు
శ్రమిస్తే 21వ శతాబ్దం మనదేనంటూ ఆసియా ఖండంలోని అన్ని దేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం మలేషియా రాజధాని కౌలాలంపూర్కు చేరుకున్న మోడీ.. ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్ పారదర్శకత దిశగా అడుగులు వేస్తోందని... ప్రపంచ దేశాలన్నీ ఓసారి భారత్ వస్తే ఈ విషయాన్ని గమనించవచ్చని పిలుపునిచ్చారు.
భారత్లో మార్పు స్పష్టంగా కనబడుతోందన్నారు. భారత్కు తూర్పు దేశాలు సహజ భాగస్వాములన్నారు. ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని, 21వ శతాబ్దం భారత్దే అని మోడీ పిలుపునిచ్చారు. ఆసియా దేశాల అభివృద్ధిని చూసే ఈ మాట చెబుతున్నానని తెలిపారు. భారత్లో అందరికీ ఇళ్లు అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేదే తమ లక్ష్యమని మోడీ ప్రకటించారు.
ప్రపంచం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో సమావేశమయ్యామన్నారు. ఆసియాన్ - భారత్ నూతన ఆవిష్కరణల వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. షిల్లాంగ్లో ఆసియాన్ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. సౌరశక్తి దేశాల కూటమిలో చేరేందుకు ఆసియాన్ దేశాలను ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆహ్వానించారు.
అంతేకాకుండా, భారత ఆర్థిక వ్యవస్థ సమూల్య పరివర్తన కోసమే సంస్కరణలు చేపట్టినట్లు మోడీ పునరుద్ఘాటించారు. స్థూల ఆర్థిక స్థిరత్వం వల్లే ఆగ్నేయాసియా దేశాలు స్థిరమైన అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత దేశంలో ఆర్థిక ప్రగతి బలం పుంజుకుందన్నారు. ఈ ఏడాదిన్నర పాలనా కాలంలో నిర్మాణరంగంలో సైతం పురోగతి సాధించినట్లు చెప్పుకున్నారు. ఇండియాకు ఆసియా దేశాలు సహజ భాగస్వాములన్న నరేంద్ర మోదీ మేకిన్ ఇండియాలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.