శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (15:25 IST)

రోడ్డు మార్గంలో వద్దామనుకున్నా.. కానీ అధికారులు భయపడ్డారు : నరేంద్ర మోడీ

నేపాల్‌కు భారత్ నుంచి రోడ్డు మార్గంలో వద్దామని అనుకున్నాననీ కానీ, మా అధికారులు భయపడటంతో తాను వారిని ఒత్తిడి చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. అంటే.. భారత్ - నేపాల్ మధ్య అధ్వాన్నంగా ఉన్న రోడ్డు మార్గంపై ఆయన పై విధంగా స్పందించారు. 
 
ఖాట్మండు వేదికగా జరుగుతున్న సార్క్ 18వ శిఖరాగ్ర సదస్సు వేదికగా మోడీ ప్రసంగిస్తూ... భారత్ నుంచి ఖాట్మండ్‌కు రోడ్డు మార్గం ద్వారా వద్దామనుకుంటే, మా అధికారులు భయపడ్డారన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందునే అధికారులు భయపడాల్సి వచ్చిందన్నారు. 
 
సార్క్ దేశాల మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పిన ఆయన ఆ సందర్భంగా నేపాల్, భారత్‌ల మధ్య ఉన్న రోడ్డు మార్గం దుస్థితిని చెప్పేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సార్క్ దేశాల మధ్య మరింత సహకారం నెలకొంనేందుకు తప్పనిసరిగా రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, పరస్పర సహకారంతో కలిసి నడిస్తే... సుసంపన్న దేశాలుగా సార్క్ దేశాలు అభివృద్ధి సాధించగలవన్నారు. సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరో వైపు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. భారత్ గురించి ఎలాంటి కలలు కంటున్నామో.. సార్క్ కూడా అలాగే ఉండాలన్నది మా ఆకాంక్ష అని అన్నారు. సమష్టిగా ముందుకెళితే ఏ ఒక్క అవసరానికీ ఇతర దేశాల వైపు చూసే అవసరమే రాదన్నారు. 
 
సార్క్ దేశాల్లో అపార అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే, పరస్పర సహకారం తప్పదన్నారు. సురక్షితమైన, బలమైన దక్షిణాసియాను భారత్ కోరుకుంటుందన్నారు. అలాగే, పొరుగు దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కాంక్షిస్తోందన్నారు. సార్క్ దేశాల చిన్నారులకు టీబీ, హెచ్‌ఐవీ వ్యాక్సిన్లు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సార్క్ దేశాల నుంచి రోగులకు తక్షణమే వైద్య వీసాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మోడీ ప్రకటించారు.