శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (16:16 IST)

సెల్ఫీ విత్ డాటర్ విభాగంలో డిగ్గీరాజా- అమృతా రాయ్‌ల సెల్ఫీ ఫోటో.. పప్పులో..?

సెల్ఫీ విత్ డాటర్ ఫీవర్ ప్రపంచ దేశాల వరకు పాకుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నప్పటికీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి డిగ్గీరాజాను మాత్రం ఇది ఇరుకున పెట్టింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ డిగ్గీ రాజా తన ప్రేయసితో కలసి తీసుకున్న సెల్ఫీని... 'సెల్ఫీ విత్ డాటర్' విభాగంలో చేర్చేసింది. దాన్ని కనిపెట్టిన ఓ వ్యక్తి... జరిగిన పొరపాటును ట్వీట్ చేశారు. 
 
మోడీ చేపట్టిన కార్యక్రమాన్ని డిగ్గీరాజా తప్పుగా అర్థం చేసుకున్నారని... సెల్ఫీ విత్ డాటర్ అని మోడీ అన్నారే గానీ, సెల్పీ విత్ గర్ల్ ఫ్రెండ్ అనలేదని కొంతమంది జోకులు పేల్చారు. మోడీ పిలుపు మేరకు ఎంతో మంది తండ్రులు తమ కూతుళ్లతో కలసి సెల్ఫీలు తీసుకున్నారనే నేపథ్యంలో, న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో భాగంగా తన జర్నలిస్టు ప్రియురాలితో డిగ్గీ రాజా కలసి ఉన్న ఫొటోను కూడా ప్రచురించి, పప్పులో కాలేసింది.
 
డెబ్బై ఏళ్లకు దగ్గర్లో ఉన్న దిగ్విజయ్ సింగ్ నలభయ్యో పడిలో ఉన్న అమృతా రాయ్ అనే జర్నలిస్టుతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహం జరుగనుంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి విదితమే.