మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:11 IST)

పాక్ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి... 72 మంది మృత్యువాత

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఆత్మాహుతి దాడితో విరుచుకుపడ్డారు. ఓ మసీదు వద్ద సూసైడ్ బాంబర్ తననుతాను పేల్చుకోవడంతో 72 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఆత్మాహుతి దాడితో విరుచుకుపడ్డారు. ఓ మసీదు వద్ద సూసైడ్ బాంబర్ తననుతాను పేల్చుకోవడంతో 72 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి పాకిస్థాన్‌‌లోని సింధ్‌ ప్రావిన్స్‌ సెహ్వాన్‌‌లో ఉన్న సుప్రసిద్ధ లాల్‌ షాబాజ్‌ కలందర్‌ దర్గాలో ఈ దాడి జరిగింది. 
 
ఈ దర్గాలో ప్రతి గురువారం ప్రార్ధనలు నిర్వహిస్తారు. ప్రార్థనల అనంతరం ధమాల్‌ (సూఫీ నృత్య వేడుక) నిర్వహిస్తారు. సరిగ్గా ధమాల్ సందడిలో ఉన్న భక్తులు ఆనందపరవశులై ఉండగా, మందిర ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తొలుత ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌‌ను సూఫీ భక్తులపైకి విసిరాడు. అయితే అది పేలలేదు. దీంతో మరింత ఆగ్రహంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 
 
భారీ శబ్దంతో దర్గాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. తొలుత వారు కూడా అక్కడి భీతావహ దృశ్యాలు చూసి బెంబేలెత్తిపోయారు. అయితే అక్కడి బాధితుల పరిస్థితి, ఆర్తనాదాలు విని చలించిపోయి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో 12 మంది మహిళలు, నలుగురు చిన్నారులతో పాటు.. 72 మందికి పైగా ఉన్నారు. మరో 250 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.