శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (09:53 IST)

టెక్సాస్‌లో దారుణం .. కుమార్తెను తుపాకీతో కాల్చి చంపిన తల్లి

అమెరికాలోని టెక్సాస్‌లో కనివినీ ఎరుగని దారుణం చోటుచేసుకుంది. కూతుళ్ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన త‌ల్లే వారిపై కాల్పులు జ‌రిపిన ఘటన అక్కడ కలకలం రేపింది.

అమెరికాలోని టెక్సాస్‌లో కనివినీ ఎరుగని దారుణం చోటుచేసుకుంది. కూతుళ్ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన త‌ల్లే వారిపై కాల్పులు జ‌రిపిన ఘటన అక్కడ కలకలం రేపింది. 42 ఏళ్ల క్రిష్టీ షిట్స్ అనే మహిళ... తన ఇద్దరు కూతుళ్లపై తుపాకీతో అతికిరాతకంగా కాల్పుల వర్షాన్ని కురిపించింది. కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా 19 ఏళ్ల టైలర్ షీట్స్‌ను, 17 ఏళ్ల మాదిసన్ షీట్స్‌ను తుపాకీతో హతమార్చింది. క్రిష్టీ తుపాకుల మోత ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులకు సమాచారం అందింది. 
 
హుటాహుటిన పోలీసులు వచ్చేసరికి పెద్ద కూతురు టైలర్‌ తుపాకుల కాల్పులకి బలైపోయింది. మరో కూతురు మాదిసన్  తూటాల గాయాలతో రక్తపు మడుగులో విలవిలలాడుతోంది. ఆ సమయంలో వచ్చిన పోలీసులు తుపాకీని కింద పడేయాలని క్రిష్టీని కోరినా ఆమె వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. క్షణికావేశంలో ఇంట్లో రక్తపాతం సృష్టించిన క్రిష్టీ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న మాదిసన్‌ను హెలికాఫ్టర్‌లో సాయంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. 
 
ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఇంట్లోనే ఉన్న క్రిష్టీ భర్త ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, అతడు మానసికంగా షాక్‌లో ఉండటంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో మొదలైన చిన్న వాగ్వాదం ఇంత దారుణానికి కారణమైందని.. క్రిష్టీ భర్త కోలుకుంటేగానీ అసలు ఏం జరిగిందనేది తెలిసే అవకాశముందని హుస్టన్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ విష‌యాన్ని మీడియాకి తెలిపారు. ఆ మ‌హిళ‌ కుటుంబంలో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతుండంతోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తుచేస్తున్నారు.