గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (03:23 IST)

పాక్ తరపున కశ్మీర్‌లోకి మూడో దేశం సైన్యం ప్రవేశించవచ్చు.. చైనా తర్కం తగలడినట్లే ఉంది

పాకిస్తాన్ తరపున కశ్మీర్‌లోకి మూడో దేశం సైన్యం ప్రవేశించే అవకాశం కొట్టిపారేయలేమని చైనా మేధో బృందం పేర్కొంది. సిక్కిం ప్రాంతంలో చైనా సైన్యం నిర్మిస్తున్న రోడ్డు మార్గాన్ని భూటాన్ తరపున అడ్డగించడానికి భారత సైన్యం ప్రయత్నించినట్లయితే, అదే తర్కాన్ని ఉపయో

పాకిస్తాన్ తరపున కశ్మీర్‌లోకి మూడో దేశం సైన్యం ప్రవేశించే అవకాశం కొట్టిపారేయలేమని చైనా మేధో బృందం పేర్కొంది. సిక్కిం ప్రాంతంలో చైనా సైన్యం నిర్మిస్తున్న రోడ్డు మార్గాన్ని భూటాన్ తరపున అడ్డగించడానికి భారత సైన్యం ప్రయత్నించినట్లయితే, అదే తర్కాన్ని ఉపయోగించి కశ్మీర్‌లోకి పాక్ తరపున మూడో దేశం సైన్యం కూడా ప్రవేశించిడానికి అవకాశమున్నట్లే కదా అని చైనా మేధావి బండ తర్కం ప్రయోగించారు. అంటే తన ఉద్దేశంలో భూటాన్ తరపున భారత్ వకాల్తా పుచ్చుకుంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తరపున చైనా కూడా వకాల్తా పుచ్చుకోవచ్చు అన్నదే ఆ మేధావి వాదన.
 
చైనా వెస్ట్ నార్మల్ యూనివర్శిటీలో భారతీయ అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ లాగ్ జింగ్‌చున్ చైనా తరపున సరికొత్త వాదనను లేవదీశారు. భూటాన్ భూభాగాన్ని రక్షించాలని భారత్‌ను ఆ దేశం అభ్యర్థించినట్లయితే, అది భూటాన్‌‌లో భాగమైన భూభాగానికే పరిమితం కావచ్చు కానీ వివాదాస్పద ప్రాంతంలో భారత్ తల దూర్చుకూడదని జింగ్ చున్ వాదించారు. 
 
భూటాన్ తరపున తాను జోక్యం చేసుకోవచ్చు అనే భారత్ తర్కం సరైనదే అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం అభ్యర్థించినట్లయితే భారత్-పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలోకి మూడో దేశం సైన్యం కూడా ప్రవేశించవచ్చుకదా. భారత్ నియంత్రణలోని కశ్మీర్ లోకి కూడా ఇలా ప్రవేశించే అవకాశం ఉన్నట్లే కదా అని జింగ్ చున్ వాదించారు.
 
భూటాన్‌లోని డోక్లామ్ ప్రాంతంలో చైనా కడుతున్న రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంపై చైనా ప్రభుత్వం మీడియా వరుసగా కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వివాదంలోకి పాకిస్తాన్‌ని, కశ్మీర్‌ని లాగడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. దీంట్లో సిక్కింలో 220  కిలోమీటర్లు భాగం. 
 
చైనా తనకు భూటాన్ ప్రాంతంలో భారత్ ద్వారా ఏర్పడుతున్న వివాదాన్ని సాకు చేసుకుని  కశ్మీర్‌లో పాక్ తరపున మూడో దేశంగా అడుగుపెట్టాలని భావించడం చాలా తీవ్ర పరిణామాలకు దారి తీయక తప్పదు. గత 70 ఏళ్లుగా ఇరుదేశాల మధ్యనే నలుగుతున్న కశ్మీర్లో మూడో దేశంగా చైనా అడుగుపెడితే జరిగే పరిణామాలు ఊహించలేనివి కాదు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడు వైఖరి భారత్‌కే ప్రమాదకరంగా పరిణమించనుందా?