దర్శకునిగా తొలి చిత్రాన్ని ప్రేమకథతో కాకుండా యుద్ధ నేపథ్యంలోసాగే కథతో ముందుకు వచ్చిన సంకల్పానికి ప్రముఖులు తోడుకావడంతో జాతీయస్థాయి చిత్రంగా మారిన 'ఘాజీ' చిత్రంతో జాతీయస్థాయి దర్శకుడుగా గుర్తింపు పొందాడు సంకల్ప్ రెడ్డి, సిజివర్క్ వంటివి కూడా ఎరిగిన సంకల్ప్ రెడ్డికి ఈ చిత్రం చేయడం కత్తిమీద సామే అయినా తొలుత యూట్యూబ్ సినిమాగా తీయాలని సంకల్పించాడు. కానీ అది అనుకోకుండా వెండితెరపై ఆవిష్కరించే దిశగా పయనమైంది. ఈనెల 17న విడుదలకానున్న ఆ చిత్రం గురించి ఆయన చెప్పిన విశేషాలు.
మీ నైపథ్యం?
పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఇక్కడ నా చదువు పూర్తవగానే ఫైన్ ఆర్ట్స్లో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాను. అది అయిపోగానే సినిమాల్లోకి రావాలని ఇలా వచ్చాను.
'ఘాజీ' సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది?
నేను అన్నవరం వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో రైలు ఆలస్యం కావడంతో వైజాగ్ మీదుగా వెళ్ళాలని అటు వచ్చాను. అక్కడ ఈ సబ్మెరైన్ను చూశాను. అప్పుడే దీని మీద, ఇండియన్ నేవీ మీద సినిమా తీద్దామని నిర్ణయించుకుని పరిశోధన మొదలుపెట్టి పూర్తి స్క్రిప్ట్ రాసుకున్నాను. కోటి రూపాయలతో సినిమా తీద్దామని మొదట నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి పని స్టార్ట్ చేశాను, సెట్ కూడా వేశాం. కానీ కుదరక పివిపి, మాటినీ సంస్థవారిని సంప్రదించాను.
ఈ సినిమా ఏం చెబుతుంది?
'ఘాజీ' అనేది పాకిస్థాన్ జలాంతర్గామి. దీని గురించి చాలా కథలున్నాయి. వాటిలో ఒకటి ఇండియా కోణంలోనిదైతే ఇంకొకటి పాకిస్థాన్ కోణం లోనిది. నేను ఇండియా కోణంలోని కథను తీసుకున్నాను. దానికి కమర్షియల్గా కొంత కల్పితాన్ని జోడించాను.
రానాతోనే చేద్దామనుకున్నారా?
అందరి థియేటర్ ఆర్టిస్టులతో చేయాలని నిర్ణయించుకున్నాను. 1971 కథ కాబట్టి వయస్సును దృష్టిలో పెట్టుకుని పెద్దవారితో ప్రయత్నాలు చేశాను. అనుకోకుండా మా కథ రానా వద్దకు వెళ్ళింది. ఆయన కథ గురించి విని ఇంట్రెస్ట్ చూపించారు. ఆయన రాకతో చిత్ర స్థాయి మారిపోయింది. హిందీలో మాత్రమే తీయాలనుకున్న సినిమా ఇప్పుడు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజవుతోంది. పీవీపీగారి వలన తమిళంలో కూడా వస్తోంది.
రానా కోసం ఏమైనా మార్పులు చేశారా ?
ఏమీ చేయలేదు. రానా పాత్రకు 45 ఏళ్ళు ఉంటాయి. కానీ రానా కోసం దాన్ని యంగ్గా చేశాం. అప్పటికే స్క్రిప్ట్, స్టోరీ బొర్డ్, సిజి వర్క్ రెడీగా ఉండటంతో కేవలం 60 రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్ల షూట్ ముగించేశాం.
బాలీవుడ్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది?
సినిమాని కరణ్ జోహార్కు చూపించాం. చాలా సన్నివేశాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా తీశాం. అది చూసిన అయన సినిమాని ప్రమోట్ చేయాలనుకున్నారు. 1971 నేవీకి చెందిన వ్యక్తులకు సినిమా స్పెషల్ షో వేశాం. వారంతా మెచ్చుకున్నారు.
ముందుముందు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
పూర్తిగాభిన్నంగా ఉండే సినిమాలు తీయాలనే అనుకుంటున్నాను. నాకు సాధారణ సినిమాలు నచ్చవు. ఇప్పటి దాకా ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి చిత్రాలు తీయాలని ఉంది.
తర్వాత ఏ సినిమాలు చేయబోతున్నారు?
ఇప్పటిదాకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతానికి 'ఘాజి' రిలీజ్ కోసం చూస్తున్న. కొత్త దర్శకుడిగా నా సినిమా ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ కావడం గర్వంగా ఉంది. సినిమా అందరికీ నచ్చితుందనే అనుకుంటున్నాను.
మీరు ఖర్చుపెట్టిన 25లక్షలు వచ్చేశాయా?
ట్యాంక్బండ్ కింద సెట్వేసి దాని ద్వారా యూట్యూబ్కు సినిమా తీయాలని ప్రయత్నించాను. దానికే రూ.25 లక్షలు అయ్యాయి. మొత్తం కోటిలో పూర్తిచేయాలనుకున్నాను. కానీ ఈ సినిమాకు ప్రముఖులు గుణ్ణం గంగరాజు, బాలీవుడ్ నుంచి కొంతమంది, పీవీపీ వంటివారు తోడుకావడంతో సినిమాగా మారింది. నేను పెట్టిన రూ.25 లక్షలు వచ్చేశాయి.
ఈ కథ ఇన్నిమలుపు తిరుగుతుందనుకున్నారా?
నేను మొదట్లో ఈ కథను పట్టుకుని చాలామందిని ప్రయత్నించాను. ఆహార్యం రీత్యా ఎవ్వరూ స్పందించలేదు. ఇంగ్లీషునే స్క్రిప్ట్ రాసుకున్నా. గుణ్ణంగంగరాజుగారు చూసి.. ఇది సినిమాగా తీద్దామని కొంత వెయిట్ చేయమన్నారు. అలా తెలుగులో అనుకున్న సినిమా హిందీ, తమిళంలో కూడా ముందుకుసాగడం థ్రిల్ కలిగించింది.