'అతనొక్కడే' చిత్రంతో సూపర్హిట్ అందుకున్న హీరో నందమూరి కళ్యాణ్రామ్ దాదాపు పదేళ్ళ తర్వాత 'పటాస్'తో మరో కమర్షియల్ హిట్ సాధించాడు. చేసిన సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటాం. అందుకు తగినవిధంగానే కష్టపడతాం. ఓం 3డి సినిమాకు ఎంత కష్టపడ్డానో నాకే తెలీదు. కానీ అది ఫెయిల్ అయింది. దాంతో ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అర్థమయింది. అయితే పటాస్ సినిమా ఇంత సక్సెస్ అవుతుందనుకోలేదు. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నాడు కళ్యాణ్రామ్.
ఎన్టిఆర్ ఆర్ట్స్ బేనర్లో నిర్మించి నిర్మాతగా కూడా తన ఉత్తమాభిరుచిని తెలియజేసారు. అనిల్ రావిపూడిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎన్టిఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా నటించి నిర్మించిన 'పటాస్' ఇటీవల వరల్డ్వైడ్గా విడుదలై సూపర్హిట్ టాక్ని తెచ్చుకుంది. ఈ సందర్భంగా కళ్యాణ్రామ్తో ఇంటర్వ్యూ..
ఎలాంటి సక్సెస్ అనుకుంటున్నారు?
పదేళ్ళు 11 సినిమాలు చేశాను. కానీ ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. సూపర్హిట్ అనే మాట వినడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ పది సంవత్సరాల్లో నేను ఏం నేర్చుకున్నాననేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ వుంటాయి. అది చాలా కామన్. ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకొని ధైర్యం కోల్పోకుండా మనమీద మనం కాన్ఫిడెన్స్ పెంచుకొని ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది ముఖ్యం. ఈ పది సంవత్సరాల్లో అది నేను నేర్చుకున్నాను.
ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు?
అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాను. ఓం సినిమాకి ఎక్కువ కష్టపడ్డాను. అది ఫెయిల్ అయింది. అలా అని నిరాశపడకూడదు. 'పటాస్' చాలా ఆడుతూపాడుతూ చేశాను. సూపర్హిట్ అయింది. వర్క్ విషయంలో ఎలాంటి తేడా లేదు. అన్ని సినిమాలూ సూపర్హిట్ కావాలనే పనిచేస్తాం. అయితే ఫెయిల్యూర్స్లో ఎలాంటి తప్పులు చేశామనేది తెలుసుకుంటే తర్వాత అలాంటి తప్పుడు చెయ్యకుండా వుండొచ్చు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, మనం ఎలాంటి సినిమా వారికి ఇవ్వాలి అనేది ఆలోచించి దాని ప్రకారమే చేశాం. ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు.
మళ్ళీ ఓం లాంటి సినిమా తీస్తారా?
కథగా చూస్తే 'ఓం' మంచి కథ. కానీ, ఆడియన్స్ మీద చాలా బర్డెన్ పడిపోయింది. ఎలా అంటే మొదటి సీన్లో ఒకటి చెప్తాను, ఆ తర్వాత ఇరవయ్యో సీన్లో మొదటి సీన్లో నేను ఒక విషయం చెప్పాను గుర్తుందా అని అడుగుతాను. ఆడియన్స్ మీద అంత బర్డెన్ పెట్టడం కరెక్ట్ కాదు. ఆడియన్స్ సినిమాకి వచ్చేది వారి మైండ్ రిలాక్స్ అవడం కోసం. ఏ సినిమా అయినా కామెడీ వుంటేనే చూస్తారు. ఓం సినిమాలో కొన్ని సీన్లు ఇలా చేస్తే బాగుండేది అనిపించింది. అవకాశముంటే మరలా చేయాలనుంది. కానీ చేయలేను.
ప్లాప్లు తీస్తుంటే విసుగుపుట్టలేదా?
అలా జరగలేదు. డిజప్పాయింట్ అయివుండొచ్చు. నేను మూడీగా వుంటే మా ఫ్యామిలీ, కొంత మంది ఫ్రెండ్స్ నాకు ధైర్యం చెప్పేవారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి మామూలు విషయాలు, నువ్వు ఇలా చెయ్యి అని నాకు ధైర్యం చెప్పేవారు. నాకు ఎనర్జీని ఇచ్చింది వాళ్ళే. అయితే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని మాత్రం అనుకోలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రాజకీయాల్లో వుండేవారు ఆ రంగంలో రాణిస్తారు. ఫెయిలయినా మళ్లీ పోటీచేస్తారు. ఇదీఅంతే.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన వుందా?
వాటికి దూరం. అందులో సరైన జ్ఞానం తెలీదు. సినిమా ప్రొడక్షన్ అంటే రాజకీయ రంగంలోని వారికి పజిల్లా వుంటుంది. నాకూ రాజకీయరంగం కూడా అంతేమరి.
వద్దనుకున్న కథను మళ్ళీ ఎలా చేయగలిగారు?
వద్దు అనుకోలేదు. మూడేళ్ళనాడు అనిల్ కథ చెబితే.. నాకే ఎందుకు చెబుతున్నావ్ అని అడిగాను. అతనొక్కడేలో మీ ఎనర్జీ చూశాను. అందుకే కథ రాసుకున్నాను అన్నాడు. నిర్మాతగా వుంటాను. హీరో వేరొకరు అన్నాను. వెళ్ళిపోయి మళ్ళీ మూడేళ్ళ తర్వాత వచ్చాడు. కొత్తవాడు ఆ కథ ఏమిటో కూడా నాకు తెలీదు. రెండు గంటలు చెప్తూనే వున్నాడు. నేను దాన్ని ఎంజాయ్ చేస్తూనే వున్నాను.
మళ్ళీ అనిల్తో సినిమా తీస్తారా?
నేను అడిగాను. మళ్ళీ కథ ఎప్పుడు చెబుతావ్ అని.. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్లో వున్నానుసార్.. మార్చిలో చెబుతాను అన్నాడు. ఓకే అన్నాను.
ఒకేసారి రెండుమూడు సినిమాలు నిర్మిస్తున్నారు?
ఇలా చేస్తానని నేను అనుకోలేదు. అలా జరిగిందంటే. తాతగారి ఆశీర్వాదం.. కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో అలా జరుగుతుంది. నిర్మాణమంతా నా బావమరిది హరి చూసుకుంటాడు. ప్రస్తుతం 'షేర్' సినిమా షూటింగ్ జరుగుతోంది. మేలో రిలీజ్ అయ్యే అవకాశం వుంది. దానికి సంబంధించి ఐదు పాటలు కొన్ని సీన్స్ బ్యాలెన్స్ వున్నాయి. అవి కూడా పూర్తి చేసి మేలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. పటాస్ రిలీజ్ అయిది. ఇప్పుడు షేర్ రిలీజ్ అవ్వాల్సి వుంది. మరో పక్క నా బేనర్లో 'కిక్-2' జరుగుతోంది అని చెప్పారు.