ఓ లెక్చరర్ స్టూడెండ్ను ప్రేమిస్తే.. వెంకటేష్.. సుందరకాండ అవుతుంది. దానిలో చివర్లో సెంటిమెంట్తో అందర్నీ కనెక్ట్ చేస్తాడు. అలాగే.. లెక్చరర్ అయిన హీరో నాని.. ఇద్దరు విద్యార్థినులను ప్రేమిస్తాడు. ఎందుకు? ఎలా? అనేది 'మజ్ను' సినిమాలో చూసి తెలుసుకోండని.. దర్శకుడు గుంటూరి విరించి వర్మ తెలియజేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' చేసిన ఆ దర్శకుడు ఈసారి మజ్ను చేశాడు. ఈ శుక్రవారమే విడుదలవుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్, ప్రియ హీరోయిన్లు. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్', 'బీరువా' చిత్రాల్ని నిర్మించిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి.కిరణ్, కేవ మూవీస్ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు విరించి వర్మతో చిట్చాట్..
దర్శకుడు కాకముందు రచయితగా చేశారా?
స్వతహాగా రచనలంటే, కవిత్వమంటే ఇష్టం. కొడవగంటి కుటుంబరావు, శ్రీశ్రీ సాహిత్యంతో పాటు పలువురి కవిత్వాలను కథలు నన్ను సాహిత్యం వైపు మళ్లించాయి. రచయితగా సినిమా రంగంలోకి ప్రవేశించి దర్శకుడు మదన్ వద్ద పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు, గుండెఝల్లుమంది సినిమాలకు పని చేశాను. నిర్మాత రామ్మోహన్ గారిని కలిసిన తర్వాత ఆయనకు 'ఉయ్యాలా జంపాలా' కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో సినిమా దర్శకత్వం చేశాను.
ఫెయిలయిన 'మజ్ను' కథేనా ఇది?
కానే కాదు. ఇది పూర్తిగా ఎంటర్టైన్గా వుంటుంది. లవ్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి. అయితే కొంతమంది మాత్రమే వాటిని దాటి తమ ప్రేమను సక్సెస్ చేసుకుంటారు. అయితే అప్పటి మజ్ను తన ప్రేమ కోసం చనిపోయాడు. కానీ మా మజ్ను సినిమా బాధాకరంగా ఉండదు. ఎంటర్టైనింగ్గా ఉంటుంది.
పోస్టర్లలో ముగ్గురి ఫొటోలతో పాటు.. లెక్చరర్ కథ అని రాశారు?
అవును. నాని ఇందులో లెక్చరర్గా నటిస్తున్నాడు. అయితే అను ఇమ్మాన్యుయల్, ప్రియాశ్రీ స్టూడెంట్సా కాదా? అనేది తెరపై చూడాల్సిందే. వీరి మధ్య జరిగే ప్రేమ కథ. అలా అని ముక్కోణపు ప్రేమ కాదు. భిన్నంగా కన్పించే టిపికల్ లవ్స్టోరీ అని ట్రైలర్లోనే చూపించాం. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మీకు అనుభవమైన సన్నివేశాలున్నాయా?
నాకు ఏ ప్రేమ కథలు లేవు. నాకు సంబంధించిన ఏ రియల్ లైఫ్ సంఘటనలు ఇందులో చూపించలేదు.
విజయాలతో వున్న నానితో టెన్షన్ అనిపించలేదా?
మొదటి సినిమా చాలా తేలికగా చేసేశాం. కానీ ప్రస్తుతం నాని వరుస సక్సెస్లతో ఉన్నాడు. కాబట్టి అందరూ నాని అంటే పాజిటివ్గా ఉంటారు. ఇప్పుడు నాని చెప్పే విషయాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకంతో నేను టెన్షన్ పడలేదు.
నానిలో మార్పు గమనించారా?
తను 'ఉయ్యాలా జంపాలా' నుంచి పరిచయం. అప్పట్లో ఎలా వుండేవాడు.. ఇప్పుడు ప్రవర్తనలో అలానే వున్నాడు. అందుకే నానికి కథ వినిపించాను. కథ వినగానే చేయడానికి సిద్ధమయ్యారు. నటుడిగా నాని యాక్టింగ్ టైమింగ్ చాలా బావుంటుంది. కథ రాసుకునేటప్పుడే నాని అనుకునే కథ రాసుకున్నాను. ఈ సినిమాలో కూడా ఒక పక్క ఏడుస్తూనే నవ్వించేలా సీన్స్ ఉంటాయి. ఇలాంటి కోణాలున్న సీన్స్లో తను మాత్రమే నటిస్తాడనిపించింది.
దర్శకుడిగా ద్వితీయవిఘ్నం అంటారుగదా భయంలేదా?
నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పటి నుండి జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి నమ్మకంగా ఉంటాను. కాబట్టి ద్వితీయ విఘ్నం గురించి భయపడలేదు.
రాజమౌళి రాజ్ తరుణ్.. ఈ చిత్రంలో ఎలా చొప్పించారు?
సినిమాలో నాని, రాజమౌళిగారి అసిస్టెంట్గా కనపడతారు. కాబట్టి ఓ సీన్లో 'బాహుబలి' చిత్రీకరణ లోకేషన్ను 'మజ్ను'లో చూపిస్తున్నాం కాబట్టి రాజమౌళిగారు ఈ సినిమాలో కనపడతారు. అలాగే హీరో రాజ్ తరుణ్ కూడా స్పెషల్ అప్పియరెన్స్లో కనపడతారు.
తదుపరి చిత్రం?
ఓ కథను రాసుకుంటున్నాను. నా మైండ్లో ఆ కథకు ముగ్గురు హీరోలు అయితే సరిపోతారనుకుంటున్నాను. కథ పూర్తి కాగానే వారిని కలిసి కథ చెప్పి ఒప్పుకుంటే సినిమా చేస్తాను.. అన్నారు.