'ఒక మనసు'.. చివరి అర్థగంట మెగా కుటుంబానికి బాగా నచ్చింది: మధుర శ్రీధర్
నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒక మనసు'. జూన్ 24న సినిమా విడుదలైంది. చిత్రం గురించి నిర్మాత మధుర శ్రీధర్ తెలుపుతూ..
నాగశౌర్య, నిహారిక జంటగా టీవీ 9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒక మనసు'. జూన్ 24న సినిమా విడుదలైంది. చిత్రం గురించి నిర్మాత మధుర శ్రీధర్ తెలుపుతూ.. ఇలాంటి యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాలు చేయాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు యాంటీ క్లైమాక్స్ నచ్చదని అంటారు, కానీ ఇలాంటివి తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. మన నిర్మాతలే ధైర్యం చేయడం లేదు. అందుకనే నిర్మాతగా యాంటి క్లైమాక్స్తో సినిమా చేస్తే బావుంటుందని, ప్రేక్షకులకు నచ్చుతుందని భావించి గట్స్తో ఒకమనసు సినిమా చేశాను.
మెగాఫ్యామిలీకి నచ్చింది...
నిహారిక హీరోయిన్గా అనగానే మెగాఫ్యామిలీ నుంచి వస్తున్న అమ్మాయి కాబట్టి ఆమెను చక్కగా చూపించాలనుకున్నాం. అలాగే ఆమె కుటుంబ సభ్యులను నిరాశ పరచకూడదని అనుకున్నాం. సినిమాను ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కించాం. చివరి అరగంట సినిమా మెగాఫ్యామిలీకి బాగా నచ్చింది.
పోల్చడం తప్పు కాదుగా...
మనం ఎప్పుడూ ఏ పనిచేసినా బాగా చేయాలనుకుంటాం. మనకంటే బాగా చేసిన వారిని బీట్ చేయాలనుకుంటాం. తప్పు లేదు. ఈ సినిమా కథ విన్నప్పుడు మరో చరిత్ర, గీతాంజలి సినిమాలు గుర్తుకు వచ్చాయి. అలాంటి సినిమా చేసే ప్రయత్నం చేశామని చెప్పాం. అలా ఆ స్థాయిలో పోల్చుకోవడం తప్పుకాదు.
మిశ్రమ స్పందన...
సినిమా కొందరికి నచ్చితే మరికొందరు స్లోగా ఉందని అన్నారు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను అందరం బాగా ప్రేమించడంతో సినిమాలో తప్పులు తెలియలేదు. కానీ ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక పస్టాఫ్లో 14 నిమిషాల పాటు ట్రిమ్ చేశాం. అది కాకుండా సినిమా విడుదలకు ముందు మూడు రోజుల వరకు సినిమా వర్క్ జరుగుతూనే ఉంది. ఫైనల్ కాపీ రాలేదు. వచ్చిన తర్వాత ఓవర్సీస్కు పంపడం ఇలా మా పనులతో సరిపోయింది. దాంతో సినిమా ఇప్పటికీ మేం చూసుకోలేదు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కుల రాజకీయాలున్నాయి. మేం ఎక్కడా సపోర్ట్ చేసినట్లు చూపలేదు. సమస్యను ఎత్తిచూపామంతే. నాగశౌర్య, నిహారికలు సూర్య, సంధ్య పాత్రల్లో ఒదిగిపోయారు. తెరపై వీరి కాంబినేషన్ చక్కగా అనిపించింది.
దర్శకత్వం చేయను...
'బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్' ఫలితంతో కాస్తా భయపడిన మాట వాస్తవమే. తర్వాత నిర్మాతగా బిజీ అయ్యాను. నన్ను ఎగ్జయిట్ చేసే పాయింట్స్ రాలేదు. దాంతో దర్శకత్వం చేయలేదు. 'విక్కి డోనర్'ను రీమేక్ చేయాలనుకున్నాను. సాధారణంగా నార్మల్ సినిమాల్లో తప్పులు చేస్తేనే విమర్శలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది సక్సెస్ అయిన చిత్రాన్ని రీమేక్ చేసినప్పుడు విమర్శ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాంతో భయపడి చేయలేదు. అలాగే శ్రీశాంత్ హీరోగా బెట్టింగ్పై ఓ సినిమా చేద్దామనుకున్నాను. అయితే క్లైమాక్స్ నేను రియల్గా ఉండాలంటే, శ్రీశాంత్ సినిమాటిక్గా ఉండాలని అన్నారు. దాంతో ఆ విషయంలో సినిమా ఆగిపోయింది. అయితే ఈ ఏడాది చివరలో నా దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను' అన్నారు.