'కుమారి 21 ఎఫ్'. సినిమాలో రేప్సీన్లు, లిప్కిస్లు వున్నాయని పలు మాధ్యమాలు కథనాలు రాయడంపై చిత్ర హీరో రాజ్ తరుణ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది చక్కటి యూత్ఫుల్ సినిమా. ఇప్పటి తరానికి చెందింది. అందుకే సెన్సార్ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. గతంలోనూ పెద్ద హీరోల చిత్రాలకూ అలాగే సెన్సార్ వచ్చిందని అంటున్నాడు. హేబా పటేల్ కథానాయికగా పరిచయమవుతున్న 'కుమారి 21ఎఫ్' చిత్రాన్ని సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మించారు. ఈ నెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్తో చిట్చాట్..
ఇందులో మీ పాత్ర నెగెటివ్వా? పాజిటివ్వా?
సుకుమార్ చిత్రాల్లో హీరో నెగెటివ్ వుంటాడు. ఆ తర్వాత పాజిటివ్గా వుంటాడు. కానీ ఇందులో అలా వుండదు. ఆయన కేవలం నిర్మాతే. దర్శకుడు వేరే వారు. ఇందులో నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర. సుకుమార్ రాసిన డైలాగ్స్ నేను చెప్పడం, రత్నవేలు ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సినిమాలో నటించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాలో నేను ప్రేమించే అమ్మాయి నాతోనే ఉండాలనుకుంటాను. వేరే వారితో మాట్లాడితే తట్టుకోలేను. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కాని నెగెటివ్ షేడ్స్ ఉండవు.
రెమ్యునరేషన్ పెంచారనే టాక్ వుంది?
ఇప్పటివరకు నా రెమ్యునరేషన్ పెంచలేదు. నాకు పెంచాలని ఉంది కాని ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక ఆలోచిస్తాను.
రచయితగా హీరోలకు కథలు రాస్తున్నారట కదా?
నేను ఖాళీగా ఉంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటాను. సునీల్ అన్న నాకు బాగా సన్నిహితుడు. ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు స్టొరీ రెడీ చెయ్యి. సినిమా చేద్దామని సరదాగా చెప్తూ ఉంటాడు. నాకు బన్నీ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన కోసం కూడా కథలు రాసుకుంటాను. కాని సీరియస్గా మాత్రం ఏ కథ సిద్ధం చేయలేదు. సునీల్ అన్న మంచి రైటర్. తను చెప్పే లైన్స్ వింటే ఖచ్చితంగా సినిమా చేయాలనిపిస్తుంది.
కొత్తమ్మాయితో నటించడం ఎలా అనిపించింది..?
టైటిల్కు తగ్గట్లుగా సినిమా కూడా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాని అన్ని పాత్రలకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. హేబా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. మోడరన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. చాలా బాగా నటించింది. ఈ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుంది.
ఇటీవలే రామ్గోపాల్ వర్మ గారిపై మీరు ఓ ట్వీట్ చేశారు?
నిజానికి ఆ ట్వీట్స్ చేసింది నేను కాదు. ఆ సమయంలో నేను వర్మ గారు ఒకేచోట ఉన్నాం. నా ఫోన్ తీసుకొని ఆయనే ట్వీట్స్ చేశారు. ఒక డైరెక్టర్ గురించి నేను అలా ఎందుకు మాట్లాడతాను.
నటన, రచయితగా రెండింటికి న్యాయం చేస్తున్నారా?
నటన పూర్తయ్యాక మరో సినిమాకు గ్యాప్ వస్తుంది. ఆ టైంలో కథలు రాస్తుంటాను. తాజాగా 'రాక్ స్టార్' సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి పాత్రల్లో నటించాలనుంది. కథలు అంటే.. నేనొక రోడ్ మూవీ రాయాలనుకుంటున్నాను. కామెడీతో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాను.
వరుస చిత్రాలతో బిజీగా వున్నారు?
అది అదృష్టంగా భావిస్తున్నాను. కుమారి.. చిత్రం తర్వాత మరో సినిమా కూడా సిద్ధంగా ఉంది. దర్శకుడు మారుతి నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకరించా. నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మరో పంజాబీ రీమేక్ సినిమాలో నటించనున్నా. మంచు విష్ణు కూడా ఆ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ వంశీ గారితో కూడా సినిమా చేయడానికి అంగీకరించాను. అది 'లేడీస్ టైలర్' సినిమాకు సీక్వెల్ అని చెప్పొచ్చు అని ముగించారు.