శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By pnr

ఐపీఎల్ 2017: విరాట్ కోహ్లీ శ్రమవృధా... ముంబై హ్యాట్రిక్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన ముంబై జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో అంచె పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన ముంబై జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళుతోంది. 
 
బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓడిపోతుందనుకున్న తరుణంలో కీరన్ పొలార్డ్ (70), క్రునాల్ పాండ్యా (37) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో బెంగళూరుపై ఏడు బంతులు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని 143గా నిర్దేశించింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ (47 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సులు)తో అర్థ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు. కానీ, క్రిస్ గేల్ 22 పరుగులు, ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు రాణించలేక పోవడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు తీసుకోగా, హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.
 
అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఏడు పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. జాస్ బట్లర్ 2, పార్థీవ్ పటేల్ 3, క్లీనెగన్ 0, రోహిత్ శర్మ 0లు వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో 2.4 ఓవర్లలో ఏడు పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పొలార్డ్ (70), పాండ్య (37) వీరోచిత బ్యాటింగ్ పుణ్యమాని ముంబై జట్టు మరో ఏడు బంతులు మిగిలివుండగానే 145 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ శ్యామ్యూల్ బద్రి హ్యాట్రిక్ సాధించాడు. పార్ధీవ్ పటేల్, మెక్లెంగన్, రోహిత్ శర్మలను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.