గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : మంగళవారం, 29 మే 2018 (10:45 IST)

ఐపీఎల్-11లో అట్టర్ ఫ్లాప్ స్టార్స్ ఆటగాళ్లు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ముగిసింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ఆలరించాయి. అయితే, ఈ సీజన్ కోసం ఆటగాళ్ళ ఎంపిక కోసం జనవరి నెలాఖరులో వేలం పాటలు జరిగాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ముగిసింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఈ పోటీలు ఆలరించాయి. అయితే, ఈ సీజన్ కోసం ఆటగాళ్ళ ఎంపిక కోసం జనవరి నెలాఖరులో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటల్లో అనేక స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. ముఖ్యంగా, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలిగిన ఆటగాళ్ళ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డారు. వీరికో కోసం రూ.కోట్లు కుమ్మరించాయి.
 
అయితే, మైదానంలో మాత్రం వారు ఫ్రాంచైజీ యజమానులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇలా విఫలమైన ఆటగాళ్ళలో ఎక్కువ భాగం రూ.కోట్లు కుమ్మరించి కొనుగోళ్లు చేసిన ఆటగాళ్లే కావడం గమనార్హం. ఏదో ఒక మ్యాచ్‌లో ఆడలేకపోతారా అని ఆశించి.. అవకాశం ఇస్తే నిరాశపరిచారు. వరుసగా విఫలమవడంతో ఆ ప్రభావం జట్టు అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. వేలంలో హీరోలుగా నిలిచి.. ఆటలో జీరోలయిన టాప్-5 ప్లేయర్స్ వీళ్లే.
 
అరోన్ ఫించ్
పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డు కలిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్‌. ఇతగాడిని పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు పోటీపడి రూ.6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గస్థాయిలో రాణించలేకపోయాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మిడిలార్డర్.. మరికొన్నింట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది. చివరికి పంజాబ్ సహయాజమాని ప్రీతిజింతాకు నిరాశనే మిగిల్చాడు.
 
బెన్‌స్టోక్స్ 
2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అదే జోరు ఈ యేడాది కొనసాగిస్తాడని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశించింది. కానీ, ఆ జట్టుకు స్టోక్స్.. తేరుకోలేని స్ట్రోక్స్ ఇచ్చాడు. తనకు వెచ్చించిన ధరకు అతడు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికాడు. ప్రపంచ క్రికెట్లో మేటి ఆల్‌రౌండర్‌గా పేరొందిన స్టోక్స్ బ్యాట్‌తో 196 పరుగులు చేయగా.. బంతితో కేవలం 8 వికెట్లు తీశాడు.
 
గ్లెన్ మాక్స్‌వెల్
ట్వంటీ20 క్రికెట్లో మంచి రికార్డు కలిగిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్. ఈ సీజన్‌లో అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు. గతేడాది భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన మ్యాక్సీ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.9 కోట్లు ఖర్చు చేసింది. కానీ, అతడి పేలవ ప్రదర్శన ఢిల్లీ విజయావకాశాలను దెబ్బతీసింది. జట్టులో అతని కన్నా తక్కువ అనుభవం ఉన్న రిషబ్ పంత్‌తో పాటు కుర్రాళ్లు బౌలర్లకు చుక్కలు చూపించి సంచలన ప్రదర్శన చేశారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆడిన అతడు అన్నింట్లో విఫలమయ్యాడు. 2018 సీజన్‌లో కేవలం 169 పరుగులు చేసి.. 5 వికెట్లు తీశాడు. 
 
జయదేవ్ ఉనద్కత్
వేలంలో భారత క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు జయదేవ్ ఉనద్కత్. ఐపీఎల్-10 సీజన్‌లో 24 వికెట్లు తీయడమే దీనికి కారణం. దీంతో ఈ దఫా పేస్ భారాన్ని మోస్తాడని భావించి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నిరాశే మిగిల్చింది. ఐపీఎల్-2018లో పేలవ ప్రదర్శన చేసిన అతడు కేవలం 11 వికెట్లు మాత్రమే తీసి ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇతని కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.11.5 కోట్లు కుమ్మరించింది.
 
మనీశ్ పాండే
టీమిండియాకు ఆడిన అనుభవం, మిడిలార్డర్‌లో సత్తాచాటే ఆటగాడు మనీశ్ పాండే. ఈ ఆటగాడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ గంపెడు ఆశలు పెట్టుకుంది. అతని కోసం వేలంలో పోటీపడి రూ.11 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క మ్యాచ్‌లో అర్థశతకం మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో దేశవాళీ ఆటగాడి కన్నా చెత్త ప్రదర్శన చేశాడు. ఫ్రాంఛైజీ సైతం విసిగిపోయి క్వాలిఫయర్-2తో పాటు కీలకమైన ఫైనల్ మ్యాచ్‌కు అతన్ని దూరం పెట్టింది. టోర్నీలో కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు.