గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (21:39 IST)

ఐపీఎల్ 2020 ఫైనల్ పోరు : శ్రేయాస్ ఒంటరి పోరాటం .. ముంబై టార్గెట్ 157

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఫైనల్ పోరు మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (65 నాటౌట్), రిషబ్ పంత్ (56) అర్థ సెంచరీలు నమోదు చేశారు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు ఉరకలేసింది. 
 
అయితే పంత్ అవుటయ్యాక వచ్చిన హెట్మెయర్ (5), అక్షర్ పటేల్ (9) రాణించకపోవడంతో ఢిల్లీ భారీస్కోరు సాధించలేకపోయింది. మరో ఎండ్‌లో అయ్యర్ ఉన్నా ఉపయోగం లేకపోయింది. చివరి ఓవర్లలో ఆ జట్టు పరుగుల వేగంగా బాగా మందగించింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. నాథన్ కౌల్టర్ నైల్‌కు 2, జయంత్ యాదవ్‌కు వికెట్ లభించాయి. 
 
కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కుదుపులు చోటుచేసుకున్నాయి. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్‌పై వీరబాదుడు బాదిన స్టొయినిస్ ఈసారి తుస్సుమనిపించాడు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఆడిన తొలిబంతికే వెనుదిరిగాడు. ధావన్ (15), రహానే (2) కూడా విఫలమయ్యారు. 
 
కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ముంబై జట్టులో ఒక మార్పు చేశారు. యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ స్థానంలో జయంత్ యాదవ్‌ను తీసుకున్నారు. ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. క్వాలిఫయర్స్-2లో సన్ రైజర్స్‌పై నెగ్గిన జట్టునే ఫైనల్ బరిలో దింపారు. 
 
ఈ టైటిల్ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలువగా, ముంబై జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచి, ఐదోసారి కప్ గెలవాలని ఆ జట్టు తహతహలాడుతోంది. మరోవైపు ఢిల్లీ జట్టు ఐపీఎల్ లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దాంతో తొలిసారే కప్ మురిపెం తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ కోరుకుంటోంది.