సురేష్ రైనా ఒంటరి పోరాటం వృధా.. గుజరాత్ లయన్స్ జోరుకు బ్రేక్ సన్ రైజర్స్ విన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హ్యాట్రిక్ విజయాలతో దూకుడుపై ఉన్న గుజరాత్ లయన్స్ జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్రేకులు వేసింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన ఉత్సాహంతో వార్నర్ సేన.. రైనా సారథ్యంలోని లయన్స్ జట్టును చిత్తు చేసి లీగ్లో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది.
సురేష్ రైనా (75; 51బంతుల్లో 9ఫోర్లు) ఒంటరి పోరాటంతో గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (74 నాటౌట్; 48 బంతుల్లో 9ఫోర్లు), శిఖర్ ధవన్ ( 53 నాటౌట్; 41 బంతుల్లో 5ఫోర్లు) అర్థసెంచరీలతో అజేయంగా నిలవడంతో సన్రైజర్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. వార్నర్-ధవన్ జోరుతో 14.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసి పది వికెట్ల తేడాతో గెలుపొందింది.
తద్వారా ఐపీఎల్-9లో హైదరాబాద్ జట్టు తొలిసారి అద్భుత ప్రతిభ కనబరిచింది. ఓపెనర్లిద్దరు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ జట్టును గెలుపు తీరానికి చేర్చారు. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్లో గుజరాత్ లయన్స్ జట్టు 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు చేతిలో ఓటమి పాలైంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగా.. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 14.5 ఓవర్లలో 137 పరుగులు సాధించింది. గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా (75) ఒంటి పోరు వృధా అయింది.