గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (11:13 IST)

విశాఖలో మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు.. తొలిసారిగా స్పైడర్ కెమెరా నీడలో..!?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. టీమిండియా కెప్టెన్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఆడే మూడు మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో విశాఖ ప్రత్యామ్నాయంగా నిలిచిన సంగతి తెలిసిందే. 
 
దీంతో ముంబై ఇండియన్స్‌, పుణె సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీలు విశాఖలో మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి చూపాయి. కాగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోనే మ్యాచ్‌లు ఆడేందుకు పుణే ఆసక్తి చూపడంతో.. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) కూడా అత్యవసర సమావేశం నిర్వహించి మ్యాచ్‌ల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ మూడు మ్యాచ్‌లకు స్పైడర్‌ కెమెరాను వినియోగించనున్నారు. 
 
విశాఖలో ఇటువంటి కెమెరాను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ధోనీ నాయకత్వంలోని పుణె జట్టు మే 10న సన్‌రైజర్స్‌, 17న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, 21న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో ఆడే మూడు మ్యాచ్‌లకు విశాఖ స్టేడియం వేదిక కానుంది.