ఐపీఎల్-9: పొట్టి క్రికెట్లో రికార్డ్.. ఒకే ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు.. కోహ్లీ, డివిలియర్స్ అదుర్స్!
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటింగ్లో ఇద్దరూ అదరగొట్టేశారు. ఏకంగా ఒకే ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు నమోదుచేశారు. తద్వారా పొట్టి క్రికెట్లో కొత్త రికార్డు నమోదైంది. పొట్టి క్రికెట్లో రికార్డులు, సృష్టించడం, తిరగరాయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ రాయల్ బ్యాట్స్మెన్ తమ బ్యాటింగ్తో వీరవిహారం చేశారు. తద్వారా ట్వంటీ-20 క్రికెట్ చరిత్రలో కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించారు.
శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలిసారి ఒకే ఇన్నింగ్స్ల్లో రెండు శతకాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ (55 బంతుల్లో 109 పరుగులు, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ 52 బంతుల్లో పది ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు సాధించి అదుర్స్ అనిపించారు. తద్వారా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇకపోతే... 249 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్కు ఆదిలోనే వికెట్ పడింది. ఓపెనర్ స్మిత్ను అరవింద్ అవుట్ చేశాడు. దీంతో మెక్ కల్లమ్ (11), జడేజా (11) క్రీజులో ఉన్నారు. తద్వారా గుజరాత్ లయన్స్ 4.1 ఓవర్లలో ఒక వికెట్ పతనానికి 30 పరుగులు సాధించింది.