ఐపీఎల్-9: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బోణీ.. ధోనీసేన ఓటమి..!
ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ బోణీ చేసింది. వరుసగా రెండు పరాజయాల అనంతరం పంజాబ్.. ధోనీ సేనపై నెగ్గింది. పటిష్ట రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై కట్టుదిట్టమైన బౌలింగ్తో మొదట పైచేయి సాధించిన పంజాబ్ కింగ్స్.. ఆపై బ్యాటింగ్లోనూ పవర్ చూపెట్టడంతో జట్టుకు తొలి విజయం సొంతమైంది. తద్వారా ధోని సేన వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆదివారం ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పుణే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (26 బంతుల్లో 38; 5 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. మోహిత్ శర్మకు మూడు, సందీప్ శర్మకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. మురుగన్ అశ్విన్కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం మధ్య ఓవర్లను పంజాబ్ బౌలర్లు నియంత్రించడంతో పుణేకు పరుగులు తీయడం కష్టమైంది. డు ప్లెసిస్ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 17వ ఓవర్లో స్మిత్ మూడు ఫోర్లు బాదడంతో స్కోరు బోర్డులో కాస్త కదలిక వచ్చింది. ఆ తర్వాత ఓవర్లోనే అతను అవుట్కాగా చివరి ఓవర్ను మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస బంతుల్లో డు ప్లెసిస్, ధోని (1)ని అవుట్ చేశాడు. ఈ ఓవర్లో అతను కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. పుణే ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. ఇది ఐపీఎల్ రికార్డు.