దసరా పండుగ సీజన్లో భారత్లో స్మార్ట్ ఫోన్ల సందడి
దసరా పండుగ సీజన్లో భారతీయ మొబైల్ మార్కెట్ను స్మార్ట్ ఫోన్లు ముంచెత్తనున్నాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్తో సహా మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా ఈ సీజన్లో తమ కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నాయి. ఈ సీజన్కు మార్కెట్కు రానున్న స్మార్ట్ ఫోన్ల వివరాలను పరిశీలిస్తే...
గూగుల్ సంస్థ నెక్సస్ 5ఎక్స్, 6పీ పేరుతో రెండు స్మార్ట్ ఫోన్ మోడళ్ళను విడుదల చేయనుంది. ఇవి ఈనెల 13వ తేదీన అందుబాటులోకి రానున్నాయి. టైప్-సీ యూఎస్బీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 12.3 ఎంపీ కెమెరా, సరికొత్త ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4కే వీడియో సపోర్ట్, మరింత పవర్ను అందించే 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ వీటికి అదనపు ఆకర్షణ. 32, 64, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తాయి.
అలాగే, సోనీ కంపెనీ ఎక్స్పీరియా జడ్5 ప్రీమియం పేరుతో తొలిసారిగా 4కే డిస్ ప్లే (3840/2160 పిక్సెల్)తో స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. 5.5 అంగుళాల ట్రిలుమినోస్ డిస్ ప్లేతో లభించే ఫోన్లో 23 ఎంపీ కెమెరా ఉంది. క్వాల్ కాం క్విక్ చార్జ్తో లభించే ఫోన్కు 10 నిమిషాల చార్జింగ్ పెడితే ఐదున్నర గంటలు పనిచేసేలా, నీటిలో పడినా ఫోను చెడిపోకుండా ఉండేలా తయారు చేశారు.
లెనోవో కంపెనీ ముందు వైపు రెండు కెమెరాలు ఉన్న తొలి ఫోన్గా వైబ్ ఎస్ 1 పేరుతో సరికొత్త ఫోన్ను ప్రవేశపెట్టనుంది. డ్యూయల్ ఫ్లాష్తో పాటు ముందు వైపు 8, 2 మెగాపిక్సెల్ కెమెరాలు, వెనుకవైపు 13 ఎంపీ కెమెరాలను అమర్చారు. 32 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యమున్న ఫోన్ 5 అంగుళాల స్క్రీన్ను, ఫుల్ హెడ్డీ డిస్ప్లేను కలిగివుంటుంది. కేవలం 7.8 మిల్లీమీటర్ల మందం, 132 గ్రాముల బరువుతో 4జీని సపోర్ట్ చేసే ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. అదేవిధంగా యాపిల్ కంపెనీ ఐఫోన్, 6ఎస్, 6ఎస్ ప్లస్ పేరుతో కొత్త మోడల్ను తీసుకునిరానుంది. వీటితో పాటు ఆసుస్ జన్ ఫోన్ మాక్స్, జియోనీ ఎస్ 5.1 ప్రో, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నాయి.