శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (18:17 IST)

విండోస్ 10 మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిపివేత...

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్ 10 మొబైల్స్‌ కథ ముగిసిపోయింది. ఈ మొబైల్స్‌కు ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించబోమని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్లకు చివరి అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ డిసెంబర్ 10న విడుదల చేసింది. 
 
అందులో పలు సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉన్నాయి. అయితే విండోస్ 10 మొబైల్‌లో వాడే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ తదితర ఆఫీస్ యాప్స్‌కు 2021 జనవరి 12వ తేదీ వరకు సపోర్ట్ ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ క్రమంలో ఆ తేదీ లోగా విండోస్ 10 మొబైల్ వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్లను మార్చాల్సి ఉంటుంది.
 
ఇదిలావుంటే, గత 2015లో నవంబరు నెలలో మొదటిసారిగా విండోస్ 10 మొబైల్ ఓఎస్‌ను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టగా.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దెబ్బకు ఆ ఓఎస్ నిలబడలేకపోయింది. దీంతో 2017లో విండోస్ 10 మొబైల్ ఓఎస్ డెవలప్‌మెంట్‌ను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇక ఇప్పుడు చివరి అప్‌డేట్‌ను ఆ ఓఎస్ కోసం మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. దీంతో ఆ మొబైల్స్ కథ ఇక ముగిసినట్లయింది.