బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (17:45 IST)

భారత్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు : సత్య నాదెళ్ల

భారతదేశంలో క్లౌడ్ డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నట్టు ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. క్లౌడ్ సేవల రంగంలోని ఇతర సంస్థలైన గూగుల్, అమెజాన్‌లు ఇప్పటి దాకా తమ డేటా కేంద్రాలను భారత్‌లో ఏర్పాటు చేయనప్పటికీ.. మైక్రోసాఫ్ట్ తొలి అడుగు వేయడం గమనార్హం. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్‌ ఏర్పాటును 2015 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీన్ని ‘2 ట్రిలియన్ ఆపర్చునిటీస్’గా అభివర్ణించిన సత్య నాదెళ్ల, భారత ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. భారత ప్రభుత్వంతో పాటు కార్పొరేట్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో కలసి పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ కృతనిశ్చయంతో ఉందన్నారు. 25 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అందుబాటులో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
కాగా, ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 13, గూగుల్‌కు 12, అమెజాన్‌కు 8 డేటా సెంటర్లున్నాయి. తాజాగా భారత్‌లో క్లౌడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించడంతో గూగుల్, అమెజాన్‌లు కూడా తమ డేటా సెంటర్లను ఇక్కడ నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు.