శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (13:31 IST)

ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన గూగుల్ ఉద్యోగులు.. నిరసన కార్యక్రమంలో సుందర్ పిచాయ్ కూడా...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ప

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా పాల్గొనడం గమనార్హం. 
 
అమెరికా హెచ్1బీ వీసాల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తానని ట్రంప్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఇది భారత ఐటీ ఉద్యోగులతో పాటు.. ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరి మనోభావాలను గూగుల్ ఉద్యోగులు కూడా పంచుకుంటున్నారు. సోమవారం వేలాదిమంది గూగుల్‌కు చెందిన వివిధ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఇంక్‌.కు చెందిన దాదాపు 2000 మంది ఉద్యోగులు వివిధ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
 
కాలిఫోర్నియా, మౌంటెన్ వ్యూలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ వలస వచ్చినవారే కావడం విశేషం. ముస్లింలు అధికంగా ఉన్న 7 దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించడంపై పరిమితులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై పిచాయ్, బ్రిన్ ఆందోళన వ్యక్తం చేశారు.