శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (15:51 IST)

ఫోల్డబుల్ (మడతబెట్టే) ఫోన్ వచ్చేసింది...

పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. వీటి ఆధారంగా ఊహకే అందని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తాజాగా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. 
 
నిజానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ఎల్‌జీ, శాంసంగ్‌లతోపాటు మొబైల్స్ తయారీ కంపెనీ హువావేలు ఈ తరహా ఫోన్లను తయారు చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రకటిస్తూ వచ్చాయి. కానీ ఈ కంపెనీలకు ఓ చైనా కంపెనీ షాకిచ్చింది. రాయొలే కార్పొరేషన్ అనే కంపెనీ మడతబెట్టే ఫోన్‌ను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్లెక్స్‌పై పేరిట ఈ ఫోన్ విడుదలైంది. 
 
ఫ్లెక్స్‌పై ఫోన్ చూసేందుకు మినీ ట్యాబ్లెట్ పీసీలా ఉంటుంది. దీని డిస్‌ప్లే సైజ్ 7.8 అంగుళాలు. మడిచిన తర్వాత ఇది రెండు డిస్‌ప్లేలు ఉన్న ఫోన్‌లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 20, 16 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. అయితే ఫోన్‌ను మడతబెడితే 20 మెగాపిక్సల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ ఫోన్‌ను 2 లక్షల సార్లు మడతబెట్టి పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేశామని రాయొలే కంపెనీ ప్రకటించింది. 
 
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8150 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1318 డాలర్లు ఉండగా, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1469 డాలర్లుగా ఉంది. డిసెంబర్‌లో ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనా మార్కెట్‌లోనే విడుదలైంది.